గురువారం, 26 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 25 సెప్టెంబరు 2024 (10:05 IST)

ప్రధాని మోడీ హిందువు కాదు.. యూపీ నుంచే గొడ్డుమాంసం ఎగుమతి : జ్యోతిర్‌మఠ్ శంకరాచార్య

jyothirmutt
జ్యోతిర్‌మఠ్ శంకారాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి మరోమారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోడీ అస్సలు హిందువే కాదన్నారు. అంతేకాకుడా, ఈ దేశంలో ఇప్పటివరకు రాష్ట్రపతులు, ప్రధానులుగా ఉన్నవారు ఎవరూ హిందువులు కాదన్నారు. దీనికి కారణం వారంతా అధికారంలో ఉన్న సమయంలో గోవధను నిషేధించలేకపోయారని ఆరోపించారు. ప్రస్తుతం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచే గొడ్డుమాసం దేశంలోని పలు ప్రాంతాలకు అత్యధికంగా ఎగుమతి అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. 
 
ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హిందువులు కాదని, కాబట్టే దేశంలో ఇప్పటికీ గోహత్య కొనసాగుతోందన్నారు. గతంలో అయోధ్య రామాలయం విషయంలోనూ ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. నిర్మాణమే పూర్తికాని రామాలయంలో విగ్రహ ప్రాణప్రతిష్ఠ పూజలు ఏమిటని ప్రశ్నించి అప్పట్లో వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. 
 
తాజాగా, మరోమారు అలాంటి వ్యాఖ్యలే చేశారు. ప్రధాని, రాష్ట్రపతి అసలు హిందువులే కాదని, ఇప్పటివరకు అత్యున్నత పదవులు అధిష్ఠించిన వారెవరూ హిందువులు కాదని సంచలన ఆరోపణలు చేశారు. దేశంలో గోహత్య కొనసాగుతుండడానికి అదే కారణమని విమర్శించారు.
 
ఉత్తరప్రదేశ్ మహంత్ యోగి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ గొడ్డుమాంసం ఎగుమతులు ఆ రాష్ట్రం నుంచే అత్యధికంగా ఉన్నాయని తెలిపారు. తిరుమల లడ్డూ వివాదంపై స్పందిస్తూ గొడ్డుమాంసం కలిగి ఉన్న ప్రసాదాన్ని కోట్లాది మంది భక్తులకు పంచడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అది హిందువులను దెబ్బతీసే కుట్ర తప్ప మరోటి కాదన్నారు. దీనిపై త్వరగా దర్యాప్తు పూర్తిచేసి చర్యలు తీసుకోవాలని కోరారు.