మంగళవారం, 2 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 31 మే 2024 (17:22 IST)

కేరళలో మానవత్వం పరిమళించిన వేళ - నిండు గర్భణికి పునర్జన్మ ఇచ్చిన వైనం...

kerala doctors
కేరళ రాష్ట్రంలో మానవత్వం పరిమళించే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. నిండు గర్భిణికి ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్, వైద్యులు, ఇతర సిబ్బంది కలిసి పునర్జన్మను ప్రసాదించారు. సకాలంలో స్పందించి తల్లీబిడ్డను కాపాడారు. ఇందుకు సంబంధించి ఆసుపత్రి సీసీ కెమెరాలో రికార్డయిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
 
కేరళలోని మలప్పురానికి చెందిన ఓ 37 ఏళ్ల మహిళ కేఎస్ ఆర్టీసీ బస్సులో త్రిస్సూర్ నుంచి కోజీకోడ్‌లోని తొట్టిపాలేనికి బుధవారం మధ్యాహ్నం బయలుదేరింది. అయితే బస్సు పేరమంగళం అనే ప్రాంతానికి చేరుకోగానే ఆమెకు ఒక్కసారిగా పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని బస్సులోని ప్రయాణికులు డ్రైవర్‌కు చెప్పడంతో అతను సమయస్ఫూర్తితో ఆలోచించి బస్సు రూటు మార్చాడు. సమీపంలో ఉన్న అమలా ఆసుపత్రికి ఎమర్జెన్సీ డెలివరీ గురించి ఫోనులో తెలియజేసి బస్సును నేరుగా అక్కడికే పోనిచ్చాడు.
 
అప్పటికే అక్కడ స్ట్రెచర్‌తో సిద్ధంగా సిబ్బంది ఆమెను ఆసుపత్రి లోపలకు తీసుకెళ్లాలనుకున్నారు. కానీ ఆ పరిస్థితి లేకపోవడంతో వైద్యులు, నర్సులు హుటాహుటిన బస్సులోకే చేరుకున్నారు. ప్రసవం చేసేందుకు అవసరమైన వైద్య పరికరాలను కూడా బస్సు వద్దకే సిబ్బంది తీసుకొచ్చారు. చివరకు బస్సులోనే ఆ మహిళ పండంటి పాపకు జన్మనిచ్చింది. అనంతరం తల్లీ బిడ్డను ఆసుపత్రిలోకి తరలించారు. ప్రస్తుతం వారిద్దరి ఆరోగ్యం మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు.
 
ఈ వీడియోను చూసిన నెటిజన్లు బస్సు డ్రైవర్, ఆసుపత్రి వైద్య బృందాన్ని మెచ్చుకుంటున్నారు. అసాధారణ పరిస్థితుల్లోనూ గర్భిణిని కాపాడేందుకు వారు చూపిన చొరవను ప్రశంసిస్తున్నారు.