బుధవారం, 18 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 21 ఆగస్టు 2024 (10:11 IST)

మెడికో హత్యాచారానికి ముందు రెడ్‌లైట్ ఏరియాకు వెళ్లిన నిందితుడు!

sanjay roy
కోల్‌కతాలోని ఆర్జీ కర్ వైద్య కాలేజీ ఆస్పత్రికి చెందిన 31 యేళ్ల జూనియర్ వైద్యురాలిపై హత్యాచార కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న సంజయ్ రాయ్ గురించి మరో ఆసక్తికర విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. బాధితురాలిపై హత్యాచారానికి ఒడిగట్టేముందు నిందితుడు సంజయ్ రాయ్ కోల్‌కతాలోని రెండు వ్యభిచార గృహాలకు వెళ్లినట్లు కోల్‌కతా పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటన జరిగిన ఆగస్టు 8న రాత్రి పూట అప్పటికే మద్యం తాగిన రాయ్.. ఆసుపత్రికే చెందిన మరో సివిక్ వాలంటీర్‌తో కలిసి కోలకతాలోని 'రెడ్ లైట్ ఏరియా'లకు వెళ్లాడు. వీరిద్దరు కలిసి ఓ ద్విచక్రవాహనాన్ని అద్దెకు తీసుకొని, తొలుత సోనాగచికి అర్థరాత్రి సమయంలో వెళ్లారు. 
 
అక్కడ రాయ్ వ్యభిచార గృహం బయట నిలుచోగా, అతడి మిత్రుడు లోపలికి వెళ్లాడు. అనంతరం రాత్రి 2 గంటల సమయంలో దక్షిణ కోల్‌కతాలోని ఓ వ్యభిచార గృహానికి వెళ్లారు. ఆ సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళను రాయ్ వేధింపులకు గురిచేశాడు. మద్యం మత్తులో ఉన్న అతడు.. ఆమె నగ్న చిత్రాలు కావాలని అడిగాడు. ఉదయం 3.50 గంటల సమయంలో రాయ్ ఆర్జీ కర్ ఆసుపత్రికి చేరుకున్నాడు. తొలుత ఆపరేషన్ థియేటర్ డోర్‌ను పగలగొట్టిన నిందితుడు.. 4.03 గంటల సమయంలో అత్యవసర విభాగంలోకి ప్రవేశించాడు. అనంతరం మూడో అంతస్తులో ఉన్న సెమినార్ గదిలోకి వెళ్లాడు. ఆ సమయంలో బాధితురాలు సెమినార్ హాల్లో గాఢ నిద్రలో ఉండగా, రాయ్ ఆమెపై దాడికి పాల్పడ్డాడు.
 
ఇక అదేరోజు రాత్రి 11 గంటల సమయంలో ఆరోకార్ ఆసుపత్రి వెనుక వైపు వెళ్లి రాయ్ మద్యం తాగినట్లు పలువురు పేర్కొన్నారు. ఆ సమయంలో పోర్న్ వీడియోలు చూసినట్లు చెప్పారు. మద్యం తాగాక పలుమార్లు ఆసుపత్రి ప్రాంగణంలో చక్కర్లు కొట్టినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఇక బాధితురాలు చనిపోయిన విషయం ఉదయం వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 9న 10.53 నిమిషాలకు బాధితురాలి తల్లికి విషయం చేరవేశారు. తొలుత బాధితురాలు ఆత్మహత్య చేసుకున్నట్లు ఆసుపత్రి సిబ్బంది చెప్పారు. అనంతరం ఇది హత్యగా తేలింది. 
 
బాధితురాలు చనిపోయిన సెమినార్ హాల్లోకి నిందితుడు వెళ్లినట్లు సీసీటీవీ పుటేజీ ఆధారంగా కోల్‌కతా పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వెల్లువెత్తడంతో కేసును సీబీఐకి అప్పగించారు. తొలుత కేసు నమోదు చేసిన ఎస్ఐ అనుప్ దత్తాపై సీబీఐ ప్రశ్నల వర్షం కురిపించింది. ఎస్ఐతో కలిసి నిందితుడు దిగిన పలు ఫొటోలను దర్యాప్తు సంస్థ సేకరించింది. ఈ కేసుకు సంబంధించి తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్న వేళ సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి ఆగస్టు 20న విచారణ చేపట్టింది. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ తీరుపై మండిపడింది. ఆత్మహత్య అని ఎలా చెప్పారంటూ ప్రశ్నలు సంధించింది.