మంగళవారం, 2 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 నవంబరు 2023 (14:34 IST)

బెంగుళూరు వాసులను భయపెట్టిన చిరుత మృతి

leopard - bear
ఐటీ నగరం బెంగుళూరు వీధుల్లో చిరుత పులి సంచరిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న కన్నడ వాసులు ప్రాణభయంతో హడలిపోతున్నారు. పలు ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్న సీసీటీవీ దృశ్యాలను చూసి స్థానిక ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక అటవీ శాఖ అధికారులు ఆ చిరుత పులిని బంధించేందుకు 70 మందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. 
 
ఆ వెంటనే రంగంలోకి దిగిన ఈ బృందం చిరుతను బంధించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో బుధవారం చిరుత కుడ్లు గేట్‌ ఏరియా వద్ద తారసపడింది. దాన్ని వలతో బంధించిన తరువాత పశువైద్యుడు మత్తుమందు ఇస్తుండగా అది అకస్మాత్తుగా దాడి చేసింది. అతడిని వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత చిరుతను కట్టడి చేసేందుకు మత్తుమందు నింపిన గన్‌ను పేల్చారు. దాంతో స్పృహ తప్పిపడిపోయింది. వెంటనే దానిని బన్నెరఘట్ట రెస్క్యూ సెంటర్‌కు తరలించారు. అక్కడ పశువైద్యులు చికిత్స అందజేస్తుండగా మృతిచెందింది. 
 
ఈ చిరుత గత శనివారం తొలిసారి ఎలక్ట్రానిక్‌ సిటీకి సమీపంలోని సింగసంద్ర ప్రాంతంలో కన్పించింది. దానిని రెండు వీధి కుక్కలు వెంబడిస్తున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీల్లో రికార్డయ్యాయి. ఆ వీడియో వైరలైన నేపథ్యంలో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన పోలీసు, అటవీశాఖ అధికారులు ఓ బృందంగా ఏర్పడి చిరుత కోసం గాలించారు. 
 
అక్టోబరు 29న అది కుడ్లులోని ఓ అపార్ట్‌మెంట్లోకి ప్రవేశించినట్లు గుర్తించారు. సుదీర్ఘంగా గాలించి ఎట్టకేలకు దాన్ని బంధించేందుకు ప్రయత్నించారు. కాగా.. చిరుత తొలిసారి కన్పించిన సింగసంద్ర ప్రాంతం బెంగళూరు బన్నెరఘట్ట నేషనల్‌ పార్క్‌కు దగ్గరలో ఉంటుంది. చిరుత అక్కడి నుంచే వచ్చి ఉండవచ్చని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు.