1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 1 జులై 2024 (11:58 IST)

దేశ వ్యాప్తంగా అమల్లోకి వచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు.. మధ్యప్రదేశ్‌లో తొలి కేసు నమోదు!!

crime
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త క్రిమినల్ చట్టాలు దేశ వ్యాప్తంగా జూలై నెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. బ్రిటీష్ పాలకుల నాటి చట్టాల స్థానంలో ఈ కొత్త క్రిమినల్ చట్టాలను కేంద్రం తీసుకొచ్చింది. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానాల్లో వరుసగా భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం పేరుతో కొత్త చట్టాలను రూపకల్పన చేసి పార్లమెంట్‌లో ఆమోదముద్ర వేసింది. దేశంలో ఆధునికమైన, మరింత సమర్థమంతమైన న్యాయ వ్యవస్థను నెలకొల్పడమే లక్ష్యంగా తీసుకొచ్చిన ఈ చట్టాల కింద మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని భోపాల్లో మొట్టమొదటి కేసు నమోదైంది.
 
ధ్వంసానికి సంబంధించిన ఘటనపై భోపాల్‌లో నిషాత్పురా పోలీస్ స్టేషన్‌లో తొలికేసు నమోదైంది. అర్థరాత్రి 12:05 గంటలకు దాడి జరగగా.. ఫిర్యాదు మేరకు రాత్రి 12:20 గంటలకు కొత్త చట్టం కింద ఎఫ్ఎస్ఐఆర్ నమోదైంది. కొత్త చట్టాల కింద కేసు నమోదు చేశామని స్టేషన్ ఇన్ఛార్జ్ వెల్లడించారు. భైరవ్ సాహు అనే వ్యక్తి తనపై కొందరు వ్యక్తులు దాడి చేశారని ఫిర్యాదు చేశారని, నిందితులపై ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేశామని వివరించారు.
 
భారతీయ న్యాయ వ్యవస్థ చట్టం ప్రకారం.. సెక్షన్ 115 కింద దాడి, సెక్షన్ 296 కింద అసభ్యకర ప్రవర్తన, సెక్షన్ 119 కింద అల్లరి చేయడం కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు. ఇక మరుగున పడిన ఐపీసీ ప్రకారం ఈ దాడి ఘటనకు సంబంధించి సెక్షన్ 323 కింద దాడి, సెక్షన్ 294 కింద అసభ్యకరమైన ప్రవర్తన, సెక్షన్ 327 కింద అల్లరి చేయడం కేసులు పెట్టేవారు. కాగా మూడు కొత్త క్రిమినల్ చట్టాలు భారత పార్లమెంట్‌లో డిసెంబర్ 21, 2023న ఆమోదం పొందగా డిసెంబర్ 25, 2023న రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. అదే రోజు అధికారిక గెజిట్ కూడా విడుదలైంది.