ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (17:09 IST)

మరో 19 రోజుల్లో వివాహం... బాంబు నిర్వీర్యం చేస్తూ అనంతలోకాలకు...

మరో 19 రోజుల్లో వివాహం జరగాల్సివుంది. ఇంతలో ఉగ్రవాదులు పెట్టిన బాంబును భద్రతా బలగాలు గుర్తించాయి. ఈ బాంబును నిర్వీర్యం చేసే పనుల్లో నిమగ్నమైవున్న ఆర్మీ మేజర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని డెహ్రాడూన్‌లో చిత్రేష్ సింగ్ బిస్త్ (31) అనే వ్యక్తి ఆర్మీ మేజర్‌గా పని చేస్తున్నాడు. ఈయనకు మరో 19 రోజుల్లో పెళ్లి జరగాల్సివుంది. ఇంతలో పుల్వామా ఉగ్రదాడి జరిగింది. ఈ దాడి జరిగిన తర్వాత ఆర్మీ అలెర్ట్ అయింది. అలాగే, చిత్రేష్ సింగ్ కూడా అప్రమత్తమయ్యారు. 
 
ఆదివారం జమ్మూకాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వద్ద ఓ ఐఈడీ బాంబ్ ఉందన్న సమాచారం అందింది. హుటాహుటిన అక్కడకు చేరుకున్న చిత్రేష్ బాంబ్‌ను డిఫ్యూజ్ (నిర్వీర్యం) చేసే పనిలో నిమగ్నమయ్యాడు. అయితే అక్కడున్న మరో బాంబ్ పేలడంతో తీవ్రగాయాల పాలయ్యాడు. వెంటనే అతడ్ని జవాన్లు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కానీ తీవ్రగాయాలు కావడంతో చిత్రేష్ సింగ్ మృతిచెందాడు.
 
అప్పటికే పెళ్లి ఏర్పాట్లలో తల్లిదండ్రులు నిమగ్నమయ్యారు. ఏర్పాట్లు కూడా ఘనంగా చేశారు. ఇంతలో కన్నబిడ్డ విగతజీవిగా ఇంటికి రావడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గుండెలవిసేలా రోదిస్తున్నారు. వాళ్ల ఆవేదన చూడలేక చుట్టుపక్కల వాళ్లు ఆ తల్లిదండ్రులను ఓదార్చలేకపోతున్నారు. 
 
వేలాదిమంది అమర్ జవాన్ చిత్రేష్ సింగ్‌ను చూసేందుకు కడసారి చూపుకోసం తరలివచ్చారు. సొంతూరు డెహ్రాడూన్‌లో చిత్రేష్ సింగ్ భౌతిక కాయానికి ఘన నివాళులర్పించారు. ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద సింగ్ రావత్, గవర్నర్ బేబి రాని మౌర్య నివాళులు అర్పించారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.