1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 6 ఆగస్టు 2021 (14:02 IST)

మాజీ భార్యను 27 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు.. కారణం ఏంటంటే?

తనకు విడాకులిచ్చి మరొకరిని పెళ్లి చేసుకున్న ఓ వివాహితను ఆమె మాజీ భర్త దారుణంగా హత్య చేశాడు. ఆమెపై 27 సార్లు కత్తితో పొడిచి అత్యంత దారుణంగా హతమార్చాడు. ఈ విషాధ ఘటన అహ్మదాబాద్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. అజయ్ ఠాకూర్, హేమ కొన్నేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వివాహమైన కొన్నేళ్ల వరకు అన్యోన్యంగానే ఉన్నారు.
 
ఇద్దరు పిల్లలు పుట్టాక భర్త ప్రవర్తనతో విసుకు చెందిన హేమ అతడిని దూరం పెట్టింది. దీంతో ఇద్దరి మధ్య తరచూ మనస్పర్థలు వచ్చాయి. ఈ క్రమంలో హేమ.. మహేష్ ఠాకూర్ అనే యువకుడితో స్నేహం చేసింది. వీరి స్నేహం కాస్త ప్రేమగా మారింది. వీరిద్దరూ కలిసి బతకాలని నిర్ణయించుకున్నారు. దీంతో హేమ తన భర్త అజయ్ ఠాకూర్‌కు విడాకులిచ్చింది. అంతేకాకుండా వారి ఇద్దరు పిల్లలను కూడా అజయ్ ఠాకూర్‌ వద్దే ఉంచింది. హేమ.. మహేష్‌ ఠాకూర్‌ను వివాహం చేసుకుంది.
 
అయితే భార్య దూరమైనప్పటి నుంచి అజయ్ ఠాకూర్ మానసికంగా కుంగిపోయాడు. తన ఇద్దరు పిల్లలను భార్య వదిలి వెళ్లడంతో వారిని ఎలా చూసుకోవాలో తెలియక బాధపడుతూ మద్యానికి బానిసయ్యాడు. తనకు ఇలాంటి దుస్థితిని తీసుకొచ్చిన భార్యపై కోపం పెంచుకున్న అజయ్ ఠాకూర్.. హేమను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. తన స్నేహితులతో కలిసి పక్కా ప్రణాళిక రచించాడు.
 
బుధవారం రాత్రి అజయ్ ఠాకూర్ తన ఇద్దరి స్నేహితులను వెంటబెట్టుకుని హేమ, మహేష్ ఠాకూర్ నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లాడు. మహేష్ ఠాకూర్ ఇంట్లో లేకపోవడంతో అజయ్ ఠాకూర్ హేమపై కత్తితో ఒక్కసారిగా దాడి చేశాడు. తప్పించుకునేందుకు ప్రయత్నించిన హేమను అతని స్నేహితులు అడ్డుకున్నారు. చివరికి హేమను వెంటాడి 27సార్లు కత్తితో పొడిచాడు. హేమ చనిపోయిందని నిర్ధారించుకున్నాక అక్కడి నుంచి అజయ్ ఠాకూర్, అతని స్నేహితులు పరారయ్యారు.
 
ఇది జరిగిన కాసేపటికి హేమ రెండో భర్త మహేష్ ఠాకూర్ ఇంటికొచ్చాడు. రక్తపు మడుగులో విగత జీవిగా పడి ఉన్న తన భార్య హేమను చూసి షాక్‌ అయ్యాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.