మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 7 ఆగస్టు 2021 (16:08 IST)

మాస్క్ లేకుండా రైలెక్కిన ప్రయాణికుడు.. అరెస్టు చేసి మెంటల్ ఆస్పత్రికి తరలింపు...

కరోనా వైరస్ దెబ్బకు ప్రతి ఒక్కరూ వణికిపోతున్నారు. ఈ వైరస్ బారినపడకుండా ఉండాలంటే ముఖానికి మాస్క్ ధరించాలని ప్రభుత్వాలతో పాటు వైద్యులు కూడా పదేపదే కోరుతున్నారు. అయినప్పటికీ అనేక మంది ఇప్పటికీ ప‌లువురు నిర్ల‌క్ష్యంగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో కరోనా నిబంధ‌న‌ల‌ను క‌ఠినంగా పాటించే సింగ‌పూర్‌లో ఓ వ్య‌క్తి మాస్క్ ధ‌రించ‌కుండా రైలు ప్ర‌యాణం సాగించాడు. కేవ‌లం గంట‌లోపే అత‌డిని అరెస్ట్ చేసిన పోలీసులు న్యాయ‌స్ధానం ఆదేశాల మేరకు అత‌డిని మాన‌సిక వైద్య‌శాల‌కు త‌ర‌లించారు.
 
బ్రిటిష్ జాతీయుడైన బెంజ‌మిన్ గ్లెయిన్ మాస్క్‌లు కొవిడ్‌-19 సోక‌కుండా మ‌న‌ల్ని కాపాడ‌లేవ‌ని న‌మ్ముతూ మాస్క్ ధ‌రించ‌కుండానే సింగపూర్‌లోని త‌న కార్యాల‌యానికి ఈ ఏడాది మేలో రైలులో బ‌య‌లుదేరాడు. ప్ర‌యాణం సాగిన కొద్దిగంట‌ల్లోనే గ్లెయిన్ (40)ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజ‌రుప‌రిచారు.
 
మాస్క్ ధ‌రించ‌క‌పోవ‌డం స‌హా ఆయ‌న‌పై ప‌లు అభియోగాలు న‌మోదు చేశారు. విచార‌ణ చేప‌ట్టిన కోర్టు గ్లెయిన్‌ను మాన‌సిక వైద్య‌శాల‌కు త‌ర‌లించి చికిత్స అందించాల‌ని సూచించింది. కాగా త‌న‌పై త‌ప్పుడు అభియోగాలు న‌మోదు చేశార‌ని కోర్టు ద‌ర్యాప్తు స‌రైన తీరులో లేద‌ని గ్లెయిన్ అసంతృప్తి వ్య‌క్తం చేశాడు.