మంగళవారం, 25 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 25 నవంబరు 2025 (10:18 IST)

బ్లూ డ్రమ్ మర్డర్ కేసు : భర్త హత్య కేసు.. జైలులో భార్య... పండంటి బిడ్డకు జన్మ

murder
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌లో జరిగిన బ్లూ డ్రమ్ మర్డర్ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ఈ కేసులో భర్తను హత్య చేసిన భార్య ముస్కాన్ ప్రస్తుతం మీరట్ జైలులో విచారణ ఖైదీ ఉంటోంది. ఈ క్రమంలో ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
నొప్పులు ఎక్కువ కావడంతో ముస్కాన్‌న్ను ఆదివారం రాత్రి 11:30 గంటల సమయంలో లాలా లజపత్ రాయ్ మెమోరియల్ మెడికల్ కాలేజీకి తరలించినట్లు తెలిపారు. ప్రసూతి విభాగం హెడ్ డాక్టర్ శకున్ సింగ్ మాట్లాడుతూ, నవజాత శిశువు 2.4 కిలోల బరువుతో ఉందని, వైద్యులు సుఖ ప్రసవం చేశారని చెప్పారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని జైలు అధికారులు పేర్కొన్నారు.
 
ముస్కాన్ కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియజేశామని, అయితే ఆసుపత్రికి ఎవరూ రాలేదని సూపరింటెండెంట్ వివరించారు. ఈ కేసు సున్నితమైనది కావడంతో ఆసుపత్రి ప్రధాన ద్వారం, వార్డుల వద్ద పోలీసులు భద్రతను పెంచారు. భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక సూచనలు జారీ చేశామని, వైద్య రికార్డులను ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నామని అధికారులు తెలిపారు.
 
కాగా, ఈ ఏడాది మార్చి 4న మీరట్‌లోని ఇందిరానగర్‌లో ఉన్న ఇంట్లో సౌరభ్ హత్యకు గురయ్యాడు. ముస్కాన్ తన ప్రియుడు సాహిల్ శుక్లాతో కలిసి సౌరభ్‌కు మత్తుమందు ఇచ్చి, కత్తితో పొడిచి చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం మృతదేహం తల, చేతులను వేరు చేసి సిమెంట్‌తో నింపిన బ్లూ డ్రమ్ములో దాచిపెట్టారు. ఈ ఘటన తర్వాత ఇద్దరూ హిమాచల్ ప్రదేశ్‌కు పారిపోయారు. వారి ప్రేమ వ్యవహారానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతోనే సౌరభ్‌ను హత్య చేసినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. మార్చి 18న సాహిల్‌తో పాటు ముస్కాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.