శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 9 జూన్ 2021 (09:26 IST)

ముందే వచ్చిన రుతుపవనాలు... ముంబైలో జోరువాన

ఈ యేడాది రుతుపవనాలు ముందుగానే వచ్చాయి. గత యేడాదిన్నర కాలంగా కరోనా వైరస్ పుణ్యమాన్ని వాయుకాలుష్యం గణనీయంగా తగ్గిపోయింది. దీంతో రుతుపవనాలు కూడా ముందుగానే ప్రవేశించాయి. ఫలితంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జోరుగా వానలు కురుస్తున్నాయి. 
 
మహారాష్ట్రలోకి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించడంతో ముంబైలో మంగళవారం నుంచి ఎడతెరపి లేకుండా వానలు కురుస్తున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతోపాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వర్షం పడుతుందని తెలిపింది. 
 
ఈ నెల 9 నుంచి 13 వరకు ముంబైతోపాటు దాని పరిసర ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుందని హెచ్చరించింది. సాధారణంగా ప్రతి ఏడాది జూన్‌ 10వ తేదీన రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని, అయితే అవి ఈసారి కాస్త ముందుగా వచ్చేశాయని భారత వాతావరణ శాఖ ముంబై డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ డా.జయంత సర్కార్‌ వెల్లడించారు.
 
ఇదిలావుంటే, ముంబైలోని కొలాబా, శాంతాక్రజ్‌లో మంగళవారం ఉదయం 8.30 నుంచి బుధవారం ఉదయం 5.30 గంటల వరకు 65.4 మిల్లీమీటర్లు, 50.4 మి.మీ. వర్షపాతం నమోదయ్యింది. అదేవిధంగా చించౌలీ, బొరివాలి, దహిసార్‌లో 60 మి.మీ. వర్షపాతం నమోదయ్యిందని వెల్లడించింది. ముంబైతోపాటు రాయ్‌గఢ్‌, థానే, పాల్ఘర్‌, పుణె, నాషిక్‌లలో వర్షం కురిసింది.