బుధవారం, 1 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

ప్రధాని నరేంద్ర మోడీకి 2047కు నో రిటైర్మెంట్ : కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్

rajnath singh
ప్రధాని నరేంద్ర మోడీ వరకు 2024 వరకు ఎలాంటి రిటైర్మెంట్ ఉండదని కేంద్ర రక్షణ శాఖామంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. పైగా, ఆయన నాయకత్వంపై తమకు సంపూర్ణ విశ్వాసముందని తెలిపారు. తమ పార్టీలో తిరుగులేని నాయకుడు ఆయనేని, అందువల్ల రానున్న చాలా ఎన్నికల వరకు బీజేపీ తరపున ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీయేనని రాజ్‌నాథ్ పునరుద్ఘాటించారు. వచ్చే 2047లో భారత స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాలు నిర్వహించిన తర్వాత ఆయన రిటైర్ అవుతారని ప్రక టించారు.
 
ఆయన తాజాగా ఓ టీవీ చానెల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆయన మాట్లాడుతూ, 'చాలా చిన్న వాస్తవం ఏమిటంటే... సమీప భవిష్యత్తులో ప్రధాని పదవికి ఎలాంటి ఖాళీ ఏర్పడబోదు. రానున్న ఎన్నికల్లో మోడీజీయే మా పార్టీ అభ్య ర్థిగా ఉంటారు. 2029, 2034, 2039, 2044, 2049 ఎన్నికల్లోనూ ఆయనే మా పార్టీ అభ్యర్థి. 2047లో దేశ స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాలు జరిగిన తర్వాత ఆయన రిటైర్ అవుతారు' అని చెప్పారు. 
 
తనకు 1980 నుంచి మోడీతో మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయని ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ప్రజలతో మమేకమయ్యే అరుదైన సామర్థ్యం ఆయనలో ఉందని ప్రశంసించారు. సంక్లిష్టమైన సమస్యలను సులువుగా పరిష్కరిస్తారని, క్లిష్ట సమయాల్లో సరైన నిర్ణయం తీసుకుంటారని అన్నారు. ప్రపంచ సమస్యలపై ఇతర దేశాల నాయకులు సయితం ఆయన సలహాలు తీసుకుంటారని చెప్పారు. అంతమంది ప్రపంచ నాయకుల నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు అందుకున్న మరో ప్రధానిని తాను చూడలేదన్నారు 
 
పహల్గాం ఉగ్రదాడిపై ప్రభుత్వం స్పందించిన తీరీ నరేంద్ర మోడీ వ్యవహారశైలికి నిదర్శనమన్నారు. ఆపరేషన్ సిందూర్ చేపట్టడానికి సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చే ముందు ఆయన మూడు దళాల అధిపతులతో యుద్ధ సన్నాహాలపై పదేపదే సమీక్షలు చేశారన్నారు. 2013లో మోడీని బీజేపీ జాతీయ ప్రచార కన్వీనర్, అనంతరం ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తూ పార్టీ పార్లమెంటరీ బోర్డు ప్రకటించిన తీరును రాజ్‌నాథ్ సింగ్ గుర్తు చేసుకున్నారు. ఆ సందర్భంగా సీనియర్ నాయకుడు. ఎల్.కె.అద్వానీని అగౌరవపరచలేదని, కానీ మోడీ నాయకత్వం కావాలని దేశ ప్రజలు కోరుకున్నారని తెలిపారు.