శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 22 సెప్టెంబరు 2022 (12:29 IST)

దేశ వ్యాప్తంగా ఎన్.ఐ.ఏ సోదాలు.. 100 మంది పీఎఫ్ఐ కార్యకర్తల అరెస్టు

arrest
దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు నిధుల కేసులో పాపులర్ ఆఫ్ ఇండియా కార్యాలయాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్​ఐఏ) సోదాలు నిర్వహించింది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం, శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేయడం, ఉగ్ర సంస్థల్లో చేర్చేందుకు సమాయత్తం చేయడం వంటి అసాంఘిక కార్యకలాపాలను పాల్పడుతున్న 100 మంది పీఎఫ్ఐకి చెందిన కార్యకర్తలను అరెస్ట్ చేశారు. 
 
ఈ దాడులు ఉత్తర్​ప్రదేశ్, కేరళ, తమిళనాడు సహా దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో గురువారం వేకువజామున జరిగాయి. రెండు రోజుల క్రితం తెలంగాణలోని నిజామాబాద్​, ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో ఎన్​ఐఏ సోదాలు నిర్వహించి పలువురు పీఎఫ్ఐకి చెందిన వారిని అదుపులోకి తీసుకుంది. వీరిని హైదరాబాద్‌కు తీసుకెళ్లి విచారిస్తున్నారు. 
 
'ఇప్పటి వరకు ఇవే అతిపెద్ద దాడులు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం, శిక్షణా శిబిరాలు నిర్వహించడం, నిషేధిత సంస్థలలో చేరడానికి వ్యక్తులను ప్రోత్సహించడం వంటి ఆరోపణలతో సోదాలు జరుగుతున్నాయి. పీఎఫ్‌ఐ జాతీయ, రాష్ట్ర, స్థానిక నేతల ఇళ్లపై, పార్టీ కార్యాలయాలపైనా దాడులు జరుగుతున్నాయి' అని జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు వెల్లడించారు. 
 
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దాదాపు 40 ప్రదేశాల్లో జరిగిన ఈ సోదాలను ఈడీ, ఎన్​ఐఏ సంయుక్తంగా నిర్వహిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అలాగే పీఎఫ్ఐపై దాడుల్లో పోలీసులు భాగమైనట్లు ఎన్​ఐఏ వర్గాలు వెల్లడించాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్వయంగా ఈ మొత్తం ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. బిహార్, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటకలో జాయింట్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు సమాచారం.