బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 జులై 2020 (18:26 IST)

పాకిస్థాన్‌ కవ్వింపులకు పాల్పడితే గుణపాఠం తప్పదు : ఇండియన్ ఆర్మీ

భారత్ - చైనా దేశాల మధ్య నెలకొనివున్న ఉద్రిక్తపరిస్థితులను అడ్డుపెట్టుకుని పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు దిగితే తగిన గుణపాఠం తప్పదని ఇండియన్ ఆర్మీ హెచ్చరించింది. ఇదే అంశంపై భారత ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ బీఎస్ రాజు మాట్లాడుతూ, ఇండోచైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ పాకిస్థాన్‌ కవ్వింపు చర్యలకు దిగితే తగిన సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. 
 
అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో పాక్‌ అంతటి దుస్సాహసానికి పూనుకుంటుందని తాము భావించడం లేదన్నారు. అయితే తూర్పు లడఖ్ ప్రాంతంలోని పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని జమ్మూ కాశ్మీర్‌లోకి పాక్‌ ఉగ్రవాదులను పంపేందుకు అవకాశం ఉందన్నారు. 
 
గాల్వాన్‌ లోయలో భారత్ ‌- చైనాల మధ్య ఘర్షణల నేపథ్యంలో పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో పాకిస్థాన్‌ భారీగా సైన్యాన్ని మోహరిస్తుందనే వార్తలు వెలువడుతున్నాయి. ఈ విషయంపై స్పందించిన శ్రీనగర్‌ కార్స్ప్‌ కమాండర్‌ బీఎస్‌ రాజు పై విధంగా స్పందించారు.
 
'ఇప్పటి వరకైతే సరిహద్దుల వెంబడి పాక్‌ సైన్యం కదలికల్లో పెద్దగా మార్పేమీ కనిపించలేదు. అయితే డిఫెన్స్‌ పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు అనిపిస్తోంది. ఏదేమైనా వాళ్లకు ధీటుగా జవాబిచ్చేందుకు మేం సిద్ధంగానే ఉన్నాం. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో పాక్‌ నుంచి భారీ సంఖ్యలో ఉగ్రవాదులు భారత్‌లో ప్రవేశించే అవకాశం ఉంది. 
 
దాదాపు 300 మంది ఉగ్రవాదులు దేశంలో చొరబడేందుకు ఎదురుచూస్తున్నారనే సమాచారం ఉంది. వాళ్లను పట్టుకునేందుకు మా సైనికులు సిద్ధంగానే ఉన్నారు. నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ దుస్సాహసానికి పాల్పడకుండా 15 కార్స్స్‌ అన్ని రకాలుగా సన్నద్ధంగా ఉంది' అని చెప్పుకొచ్చారు.