శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 3 డిశెంబరు 2019 (15:30 IST)

ప్రియుడితో పారిపోయిన ఇల్లాలు... పెళ్లి ఖర్చు చెల్లించి వెళ్లమన్న గ్రామ పెద్దలు

ఒడిషా రాష్ట్రంలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ఓ వివాహిత కట్టుకున్న భర్తతో కలిసి జీవించడం ఇష్టంలేక... తన ప్రియుడితో కలిసి పారిపోయింది. వారిని గ్రామ పెద్దలు పట్టుకుని, పంచాయతీకి తీసుకొచ్చి తీర్పునిచ్చారు. ప్రియుడుతో కలిసి వెళ్లడంలో తమకెలాంటి అభ్యంతరం లేదు కానీ పెళ్లి కోసం భర్త ఖర్చు చేసిన మొత్తాన్ని చెల్లించి వెళ్లాలంటూ తీర్పునిచ్చారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఒడిషా రాష్ట్రంలోని సుందర్ గడ్ జిల్లా రూర్కేలా సమీపంలోని మడియాకుదర్ గ్రామానికి చెందిన యువతికి ముండాఝోరొ గ్రామానికి చెందిన యువతితో గత మే నెలలో పెళ్లి జరిగింది. అయితే, ఆమెకు చిరుబెడా గ్రామానికి చెందిన పురాణ్ సింగ్ అనే యువకుడితో పెళ్లికి ముందు నుంచే ప్రేమ వ్యవహారం కొనసాగిస్తూ వచ్చింది. పైగా, పెళ్లి అయిన తర్వాత కూడా భర్తతో కాపురం చేస్తూనే ప్రియుడుతో ఏకాంతంగా గడుపుతూ వచ్చింది. 
 
ఈ విషయం తెలుసుకున్న భర్త.. భార్యను పలుమార్లు హెచ్చరించాడు. అయినప్పటికీ ఆమె ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. ఈ క్రమంలో ఇక ప్రియుడితో వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న ఆమె, బస్టాండులో గ్రామస్తులకు పట్టుబడింది. ఇద్దరినీ తాళ్లతో కట్టేసిన గ్రామస్తులు, పురాణ్ సింగ్ కుటుంబ సభ్యులను పిలిపించారు. ఆపై గ్రామ పెద్దలు విచారణ జరిపారు. వారిద్దరూ కలిసివుంటామనే చెప్పడంతో, పెళ్లి నిమిత్తం ఖర్చు పెట్టిన రూ.1.50 లక్షలు వెనక్కు ఇచ్చేసి వెళ్లిపోవచ్చని తీర్పునిచ్చారు. 
 
గ్రామ పంచాయతీ పెద్దల తీర్పును అంగీకరించిన పురాణ్ సింగ్... రూ.50 వేలు ఇచ్చి, మిగతా డబ్బు త్వరలోనే ఇస్తానని చెప్పి, ప్రియురాలిని తీసుకుని వెళ్లాడు. ఇక, ఈ మొత్తం వ్యవహారాన్ని సెల్ ఫోన్లలో చిత్రీకరించిన కొందరు సోషల్ మీడియాలో పెట్టగా, అది వైరల్ అయింది. దీంతో తమ ప్రాణాలకు హాని ఉందని పురాణ్ సింగ్ పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదైంది. ఇరు వర్గాలతో పాటు గ్రామ పెద్దలను పిలిపించి విచారిస్తున్నారు.