శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 20 ఆగస్టు 2019 (11:26 IST)

ఊఁ.. అనండి... పాకిస్థాన్ అంతు తేల్చేస్తాం : ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్

భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ గర్జించారు. పాకిస్థాన్‌తో పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధమని బహిరంగంగా ప్రకటించారు. అంతేనా.. ఊఁ అనండి... వారి అంతు తేల్చేస్తాం అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి చెప్పారు. 
 
గత ఫిబ్రవరి నెలలో పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌తో పూర్తిస్థాయి యుద్ధం చేసేందుకు భారత ఆర్మీ సిద్ధమైందట. బాలాకోట్ దాడికి ముందు సైన్యాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ కేంద్రం ముందు ఓ ప్రతిపాదన ఉంచారని, ఒక్కసారి అనుమతి ఇస్తే, తన సైన్యం పాకిస్థాన్‌లోకి దూసుకెళుతుందని ఆయన చెప్పారని, అయితే, ఈ చర్చల తర్వాత ఆయనకు అనుమతి ఇచ్చేందుకు కేంద్రం సంకోచించినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
గత ఫిబ్రవరి నెల 14వ తేదీన జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలో భారత జవాన్లను లక్ష్యంగా చేసుకుని పాక్ ప్రేరేపిత జైషే మొహ్మద్ ఉగ్రవాదులు భీకరదాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 48 మంది వరకు సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. 
 
ఈ చర్యకు ప్రతిచర్యగా భారత్ వైమానికదళం పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని జైషే మొహ్మద్ ఉగ్రస్థావరాలపై మెరుపుదాడులు నిర్వహించింది. అంతేకాకుండా, సరైన గుణపాఠం చెప్పేందుకు వైమానికదాడులతో పాటు అందుబాటులోని అన్ని మార్గాలను ప్రభుత్వం అన్వేషించింది. అదేసమయంలో రావత్‌, భారత సైన్యం సత్తా గురించి, సన్నద్ధత గురించి ప్రభుత్వ పెద్దలకు సమాచారాన్ని ఇచ్చారు.
 
ఈ విషయాన్ని త్వరలో రిటైర్ అవుతున్న ఉన్నతాధికారులతో సోమవారం సమావేశమైన రావత్, స్వయంగా బయటపెట్టారు. భూతల యుద్ధానికి సైన్యం సిద్ధంగా ఉందని తాను స్పష్టంగా చెప్పినా, అందుకు అనుమతి లభించలేదని ఆయన వ్యాఖ్యానించినట్టు సమాచారం. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అనేక మంది నెటిజన్లు యుద్ధానికి అనుమతివ్వాలని అభిప్రాయపడుతున్నారు.