1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 ఫిబ్రవరి 2022 (13:04 IST)

శతాబ్దానికి ఒక్కరు అంటూ లతా దీదీ మరణంపై రాష్ట్రపతి సంతాపం

భారత సినీ దిగ్గజ గాయని లతా మంగేష్కర్ మృతిపట్ల రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ సంతాపం తెలిపారు. శతాబ్దానికి ఒక్కరు అంటూ ఆయన లతా దీదీతో ఉన్న తనకున్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. లతా మంగేష్కర్ మృతిపై రాష్ట్రపతి విడుదల చేసిన సంతాప సందేశంలో లతా దీదీ చనిపోయారన్న వార్త గుండెని ముక్కలు చేసిందన్నారు. 
 
ప్రపంచంలో ఉన్న ఆమె అభిమానులందరికీ అది శరాఘాతం అని చెప్పారు. దేశ గొప్పదనం గురించి ఆమె పాడిన పాటలు, ఎన్నో తరాల్లోని అంతరంగాలకు అద్దంపడుతుందని చెప్పారు. ఆమె సాధించిన గొప్ప గొప్ప విజయాలకు వేరేవీ సాటిరావన్నారు. ఇలాంటి తారలు శతాబ్ధంలో ఒకరు మాత్రమే పుడతారని పేర్కొన్నారు.
 
తాను ఆమెను కలిసిన ప్రతి సందర్భంలోనూ ఆమెలో ఉన్న మానవతా కోణంలో, దయాగుణాన్ని చూశానని వెల్లడించారు. తియ్యటి స్వరంతో ఎన్నో పాటలను పాడిన గళం ఇపుడు మూగబోయి ఉండొచ్చుగా, ఆమె పాటలు మాత్రం చిరకాలం గుర్తుండిపోతాయని, ప్రతిధ్వనిస్తుంటాయని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. 
 
ప్రధాని మోడీ సంతాపం 
 
"నైటింగేల్ ఆఫ్ ఇండియా" లతా మంగేష్కర్ ఇకలేరు. గత కొద్ది రోజులుగా కరోనా, న్యూమోనియాతో బాధపడుతూ ముంబైలోని బ్రీచ్‌కాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆమె ఆదివారం ఉదయం కన్నుమూశారు. 92 యేళ్ల లతా మగేష్కర్ ఆరోగ్యం శనివారం రాత్రి నుంచే విషమంగా మారడంతో ఆదివారం ఉదయం కన్నుమూశారు. 
 
ఇదిలావుంటే, 92 యేళ్ల లతా మంగేష్కర్ 7 దశాబ్దాలకు పైగా భారతీయ సంగీతానికి ఆమె చేసిన కృషి అద్భుతం. లతా మంగేష్కర్ తన గాన జీవితంలో అనేక అవార్డులను గెలుచుకున్నారు. ఆమెకు గత 2001లో భారతరత్న, 1999లో పద్మ విభూషణ్, 1989లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులను గెలుచుకున్నారు. 
 
కాగా, లంతా మంగేష్కర్ మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. ఆమె మృతివార్త తెలిసిన వెంటనే ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. "నేను చెప్పలేనంత వేదనలో ఉన్నాను. దయ, శ్రద్ధ గల లతా దీదీ మమ్మల్ని విడిచిపెట్టారు. ఆమె మన దేశంలో పూరించలేని శూన్యాన్ని మిగిల్చారు. రాబోయే తరాలు ఆమెను భారతీయ సంస్కృతికి మారుపేరుగా గుర్తుంటుంది. ఆమె మధురమైన స్వరం ప్రజలను మంత్రముగ్ధులను చేసింది. లతా దీదీ పాటలు రకరకాల భావోద్వేగాలను తీసుకొచ్చాయి. 
 
ఆమె దశాబ్దాలుగా భారతీయ చలనచిత్ర ప్రపంచం మార్పులను చూసింది. సినిమాలకు అతీతంగా ఆమె భారతదేశం అభివృద్ధిపై ఎల్లపుడూ మక్కువ చూపేవారు. ఆమె బలమైన, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని చూడాలని కోరుకుంది. లతా దీదీ నుంచి నేను అపారమైన ప్రమేము పొందడం నా గౌరవంగా భావిస్తున్నాను. ఆమెతో నా పరిచయం మురవలేనిది. లతా దీదీ మరణం నాకు బాధ కలిగించింది. ఓం శాంతి" అంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.