శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 డిశెంబరు 2020 (12:58 IST)

దేశంలో తొలి డ్రైవర్ రహిత మెట్రో రైల్ ప్రారంభం

దేశంలో తొలి డ్రైవర్ రహిత మెట్రో రైల్ సేవలు ప్రారంభమయ్యాయి. వీటిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం ప్రారంభించారు. తొలి రైలు సర్వీసు ఢిల్లీలోని పశ్చిమ జనక్‌పురి నుంచి బొటానికల్ గార్డెన్ వరకు ప్రారంభమయ్యాయి. ఈ రెండు ప్రాంతాల మధ్య మొత్తం దూరం 37 కిలోమీటర్లు. ఈ తొలి డ్రైవర్‌ రహిత మెట్రో రైలు సేవలను ప్రధాని మోడీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు.
 
కాగా వచ్చే ఏడాది జూన్ నాటికి ఢిల్లీ మెట్రోలోని 57 కిలోమీటర్ల పింక్‌ లైన్‌లో కూడా ఈ సర్వీసులు ప్రారంభంకానున్నాయి. ఇందులోభాగంగా, సోమవారం నేషనల్‌ మొబిలిటీ కార్డును కూడా ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ, భారత్ స్మార్ట్ సిస్టమ్‌లో ఎంతగా ముందుకు వెళుతుందన్న విషయాన్ని డ్రైవర్ లెస్ మెట్రో సేవల ప్రారంభం స్పష్టం చేస్తోందని చెప్పారు.
 
'దేశంలో అటల్ జీ హయాంలోనే మొట్టమొదటి మెట్రో ప్రారంభమైంది. తిరిగి 2014లో మా ప్రభుత్వం ఏర్పడినప్పుడు కేవలం 5 నగరాల్లో మాత్రమే మెట్రో సేవలు ఉండేవి. ఇప్పుడు 18 నగరాల్లో మెట్రో సేవలు అందుతున్నాయి. 2025లోపు దేశంలోని 25 నగరాల్లో మెట్రో సేవలు అందేలా చేస్తాం' అని చెప్పారు.