1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 ఏప్రియల్ 2022 (10:46 IST)

ముంబై వ్యాపారి ఆఫీసు గోడల్లో కరెన్సీ నోట్ల కట్టలు...

currency notes
ముంబై మహానగరానికి చెందిన ఓ వ్యాపారికి చెందిన ఆఫీసు గోడల్లో కుప్పలు తెప్పలుగా కరెన్సీ నోట్ల కట్టలు వెలుగు చూశాయి. ముంబై నగరంలోని కల్బాదేవి ప్రాంతానికి చెందిన ఈ వ్యాపారి వ్యాపార టర్నోవర్ గత మూడేళ్లలో రూ.1,764 కోట్లకు పెరిగింది. ఈ విషయాన్ని గుర్తించిన జీఎస్టీ అధికారులు ఆ వ్యాపారి ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఇంట్లో ఒక్క రూపాయి కూడా లభించలేదు. దీంతో ఇంటి గోడలను, నేలను తవ్వి చూడగా ఆశ్చర్యపోయే రీతిలో దాదాపు రూ.10 కోట్ల విలువైన నగదు, వెండి ఇటుకలను వెలుగు చూశాయి. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కల్బాదేవి ప్రాంతానికి చెందిన చాముండా అనే వ్యాపారికి చెందిన కార్యాలయం ఉంది. ఇటీవల ఈ కంపెనీ టర్నోవర్ అకస్మాత్తుగా పెరిగిపోయింది. దీంతో జీఎస్టీ ముంబై శాఖ అధికారులకు అనుమానం వచ్చి ఆరా తీశారు. గత మూడేళ్లలో ఏకంగా రూ.23 లక్షల నుంచి రూ.1764 కోట్లకు పెరగడంతో అధికారుల్లో అనుమానాలు రేకెత్తించింది.
 
దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఆ వ్యాపారికి చెందిన వ్యాపార కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. అయితే, గోడకు అమర్చిన ఓ టైల్స్‌లో తేడా కనిపించింది. దీంతో ఆ టైల్‌ను తొలగించి చూసిన అధికారులు ఆశ్చర్యపోయారు. నగదు కుక్కిన గోనె సంచులు కనిపించడంతో వాటిని వెలికి తీశారు. తీస్తున్న కొద్దీ బయటపడుతూనే ఉన్నాయి. దీంతో అధికారులు నోరెళ్లబెట్టారు.
 
ఈ గోనె సంచలపై ఆరా తీయగా కుటుంబ సభ్యులు తమకేం తెలియదని చెప్పారు. దీంతో జీఎస్టీ అధికారులు ఆదాయపన్ను శాఖ అధికారులకు సమాచారం చేరవేశారు. అధికారులు వచ్చి ఆ నగదును లెక్కించగా అందులో రూ.9.8 కోట్ల నగదు, రూ.13 లక్షల విలువైన 19 కేజీల వెండి ఇటుకలు లభ్యమయ్యాయి. ఈ నోట్ల కట్టలకు సంబంధించి చాముండిపై జీఎస్టీ, ఐటీ శాఖ అధికారులు వేర్వేరుగా కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.