శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 21 జూన్ 2020 (20:40 IST)

చైనాపై దాడికి భారత బలగాలకు పూర్తి స్వేచ్ఛ - రక్షణ మంత్రి రాజ్‌నాథ్

సరిహద్దుల్లో ఉద్దేశ్యపూర్వకంగా ఘర్షణాత్మక వైఖరిని అవలంభిస్తూ ఉద్దేశ్యపూర్వకంగా రెచ్చగొడుతూ, భారత సైనికులను హతమార్చుతున్న చైనా సైన్యానికి ధీటుగా సమాధానమివ్వాలని భారత్ నిర్ణయించింది. ఇందుకోసం భారత సైనికులకు పూర్తి స్వేచ్ఛనిచ్చినట్టు కేంద్ర రక్షణ శాఖామంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. 
 
సీడీఎస్ బిపిన్ రావత్‌తో పాటు త్రివిధ దళాల అధిపతులతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం సమావేశమయ్యారు. నియంత్రణ రేఖ వెంబడి దళాల మోహరింపుతో పాటు, సరిహద్దుల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై వీరందరూ సమీక్షించినట్లు సమాచారం.
 
ఇరు దేశాల మధ్య ఘర్షణాత్మక వాతావరణం తలెత్తేలా ప్రవర్తించకూడదని, ఒకవేళ చైనా మాత్రం అందుకు తగ్గ వాతావరణం కల్పిస్తే మాత్రం... ఏమాత్రం వెనక్కితగ్గకుండా ధీటుగా సమాధానమివ్వాలన్న నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. 
 
అంతేకాకుండా ఈ విషయంలో మాత్రం భద్రతా బలగాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి, చైనాకు తగిన బుద్ధి చెప్పాలని ప్రభుత్వం నిర్ణయించుకుందని ప్రభుత్వ వర్గాలు అన్యాపదేశంగా స్పష్టంచేశాయి. 
 
అంతేకాకుండా, ఇకపై చైనా కార్యకలాపాలపై నిఘా ఉంచాలని ఆదేశించారు. భూ, జల, వాయు మార్గాల్లో చైనాపై నిఘా వేయాలని స్పష్టం చేశారు. చైనా ఎలాంటి దుశ్చర్యలకు ప్రయత్నించినా ధీటుగా బదులివ్వాలని నిర్ణయించారు. చైనా సైనికుల దుస్సాహసానికి గట్టిగా బదులిచ్చేందుకు సిద్ధంగా ఉండాలంటూ త్రివిధ దళాలకు వివరించారు. చైనాతో సరిహద్దుల్లో వ్యూహాత్మక విధానం అనుసరించాలని తీర్మానించారు.
 
నేపాల్ నుంచి కొత్త ముప్పు.. 
మరోవైపు, నేపాల్ నుంచి మరో కొత్త ముప్పు వచ్చిపడింది. భారత భూభాగాలని తమవిగా చూపే కొత్త మ్యాపుకు ఆమోదం తెలిపిన నేపాల్ తాజాగా సరిహద్దు వెంబడి భారత వ్యతిరేక ప్రచారానికి శ్రీకారం చుట్టుంది. ఆ భూభాగాలు నేపాల్‌కు చెందుతాయంటూ భారత్ సరిహద్దు గ్రామాల్లో ఎఫ్‌ఎమ్ చానళ్ల ద్వారా విస్తృత ప్రచారం చేస్తూ, సరిహద్దు గ్రామాల ప్రజల్లో భయాందోళనలు నెలకొల్పుతోంది. 
 
'నేపాలీ పాటల మధ్యలో భారత్ వ్యతిరేక ప్రచారానికి కొన్ని ఎఫ్ఎమ్ ఛానళ్లు దిగుతున్నాయి. గతంలో నేపాల్ నేతలు చేసిన భారత వ్యతిరేక ప్రసంగాలను పునఃప్రసారం చేస్తున్నాయి. కాలాపానీ, లిపులేఖ్, లింపియధూరలను తమ భూభాగాలుగా చెప్పే వార్తలను ప్రసారం చేస్తున్నాయి' అని సరిహద్దుకు సమీపంలోని భారత్ గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. 
 
ఈ రేడియో స్టేషన్ల పరిధి దాదాపు 3 కిలోమీటర్లు ఉండటంతో సరిహద్దుకు సమీపంలోని ఇరు దేశాల గ్రామస్థులకు ఇది చేరుతోందని వారు అంటున్నారు. అయితే.. స్థానిక పోలీసులు మాత్రం ఈ విషయంలో తమ వద్ద ఎటువంటి సమాచారం లేదని చెబుతున్నారు. అయితే, స్థానికులు మాత్రం నేపాల్ విష ప్రచారానికి విరుగుడు కనిపెట్టాలని కోరుతున్నారు.