1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 డిశెంబరు 2020 (12:39 IST)

పని మనిషిపై ప్రతాపం.. పనికి రాలేదని తుపాకీతో కాల్చి చంపారు...

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్‌లో దారుణం జరిగింది. ఇంట్లో పని చేసే పనిమనిషి రాలేదని ఆగ్రహించిన ఓ రిటైర్డ్ అధికారి ఆమె ఇంటికెళ్లి తుపాకీతో కాల్చి చంపాడు. ఆ తర్వాత ఆమె కుమారుడిని కూడా గాయపరిచాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాలను పరిశీలిస్తే, రాంపూర్ పరిధి‌లోని ఛిద్దావాలా గ్రామంలో రిటైర్డ్ అధికారి సోమపాల్ సింగ్ ఇంటిలో అదే గ్రామానికి చెందిన ఒక మహిళ ఇంటిపనులు చేస్తుంటుంది. అయితే ఆమె శనివారం పనిలోకి రాలేనని తెలిపింది.
 
దీంతో అగ్గిమీద గుగ్గిలమైన అధికారి నేరుగా ఆమె ఇంటికి వెళ్లి, ఆమెతో గొడవ పడ్డాడు. మధ్యలో కలగజేకున్న ఆమె కుమారునిపై దాడి చేశాడు. తర్వాత ఆమె జుట్టుపట్టకుని మెడమీద తుపాకీతో కాల్చాడు. దీంతో అమె అక్కడికక్కడే మృతి చెందింది. 
 
దీనిపై పోలీసు అధికారి అరుణ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, నిందితుడు సోమపాల్ తన ఇంటిలోపనిచేసే 35 ఏళ్ల మహిళను తుపాకీతో కాల్చి హత్య చేశారు. అడ్డుపడిన ఆమె కుమారుణ్ణి గాయపరిచాడన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు చెప్పారు.