శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 31 జనవరి 2023 (14:03 IST)

50 యేళ్ల తర్వాత ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం

space
ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. అదీ కూడా 50 యేళ్ల తర్వాత గ్రీన్ కామెట్ అనే తోక చుక్క మళ్లీ కనువిందు చేయనుంది. ఇది గతంలో 50 యేళ్లక్రితం కనిపించినట్టు అంతరిక్ష పరిశోధకులు చెపుతున్నారు. మళ్లీ ఇన్నాళ్లకు ఇది ఆకాశంలో కనువిందు చేయనుంది. 
 
ఫిబ్రవరి 2 నుంచి 6వ తేదీ వరకు కనిపించనున్న ఈ తోకచుక్కను విజయవాడ వాసులు మరింత స్పష్టంగా చూడొచ్చు. నగరానికి ఉత్తర దిక్కున ధృవ నక్షత్రం, సప్తర్షి మండలం మధ్యలో ఇది కనిపిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ 'గ్రీన్ కామెట్‌'కు శాస్త్రవేత్తలు సీ/2022 ఈ3 (జడ్‌టీఎఫ్)గా నామకరణం చేశారు.
 
అయితే, ఈ తోకచుక్క బుధవారం భూమికి 42 మిలియన్ కిలోమీటర్ల సమీపానికి రానుందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తెలిపింది. దీన్ని ఇపుడు చూడలేకపోతే ఇక జీవితంలో ఎన్నడూ చూడలేరని తెలిపింది. ఎందుకంటే ఇది మళ్లీ కొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాతే కనిపిస్తుందని పేర్కొంది. ఇది బృహస్పతి కక్ష్యలో ఉండగా గతేడాది మార్చిలో ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. అప్పటి నుంచి అది వెలుగులు విరజిమ్ముతూనే ఉంది. 
 
తోకచుక్కలు అంటే మరేంటో కావని, వాయువులతో నిండిన అంతరిక్ష మంచు గోళాలేనని ముంబైలోని అక్షయ గంగ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ సభ్యుడు అమృతాన్షు వాజపేయి తెలిపారు. ఇవి దాదాపు ఒక నగరం అంత వ్యాసంతో ఉంటాయని, సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు వేడెక్కి ధూళిని, వాయువులను అమితమైన వెలుగుతో బయటకు వెదజల్లుతాయన్నారు.