1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 11 మే 2022 (15:45 IST)

రాజద్రోహం చట్టం కింద కేసులు నమోదు చేయొద్దు : సుప్రీంకోర్టు

supreme court
బ్రిటీషర్ల కాలంనాటి చట్టం దేశంలో ఇంకా అమల్లో వుంది. అదే రాజద్రోహం చట్టం. అనేక రాజకీయ పార్టీలు తమ ప్రత్యర్థులపై ఈ చట్టాన్ని ప్రయోగించి, పగతీర్చుకుంటున్నాయి. అందుకే రాజద్రోహం చట్టం ఇపుడు చర్చనీయాంశంగా మారంది. ఈ క్రమంలో చట్టంపై ఇపుడు తీవ్ర చర్చ జరుగుతుంది. దీంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని, ఈ చట్టంపై సమీక్షకు పూనుకుంది. 
 
ఈ సమీక్ష పూర్తయ్యేంత వరకు రాజద్రోహం చట్టం కింద కేసులు నమోదు చేయొద్దంటూ కేంద్రాన్ని ఆదేశించింది. సమీక్ష పూర్తయ్యేంత వరకు ఆగాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ అంశంలో పిటిషనర్ల ఆందోళనను పరిష్కరించాల్సివుందని వ్యాఖ్యానించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సారథ్యంలోని ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. 
 
ఇప్పటికే ఐపీసీ సెక్షన్ 124 కింద (రాజద్రోహం) కేసులు నమోదై జైళ్ళలో ఉన్నవారు ఉపశమనం, బెయిల్ కోసం తగిన న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని సూచించింది. ఈ చట్టాన్ని పునరాలోచించే దిశగా డ్రాఫ్ట్‌ను కేంద్రం రూపొందించినట్టు అంతకుముందు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు విన్నవించారు. 
 
రాజద్రోహం అభియోగాల కింద కేసు నమోదుకు తగిన ఆధారాలు ఉన్నాయని, ఎస్పీ ర్యాంకు అధికారి భావించినపుడే రాజద్రోహం చట్టం కింద కేసు నమోదు చేయాల్సి ఉంటుందని ధర్మాసనం అభిప్రాయపడింది. అదేసమయంలో ఈ చట్టంపై సమీక్ష పూర్తయ్యేంత వరకు కొత్త కేసులు నమోదు చేయరాదని సూచించింది.