1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 మే 2024 (12:34 IST)

ఆప్ రాజ్యసభ ఎంపి స్వాతిపై భౌతికదాడి... సీఎం కేజ్రీవాల్ తల్లిదండ్రుల వద్ద విచారణ?

kejriwal
ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్‌‌పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సహాయకుడు బిభవ్‌ కుమార్‌ దాడి వ్యవహారం దేశ రాజధాని రాజకీయాలకు కుదిపేస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. సీఎం నివాసంలోనే తనపై దాడి జరిగినట్లు ఎంపీ ఫిర్యాదు చేయడంతో అక్కడి సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. అదేసమయంలో ఈ కేసులో కేజ్రీవాల్‌ తల్లిదండ్రులను కూడా పోలీసులు ప్రశ్నించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అనారోగ్యంతో బాధపడుతున్న తమ వృద్ధ తల్లిదండ్రులను విచారించేందుకు ఢిల్లీ పోలీసులు సిద్ధమయ్యారంటూ సీఎం కేజ్రీవాల్ బుధవారం రాత్రి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. సీఎం తల్లిదండ్రులతో పాటు ఆయన సతీమణి సునీత నుంచి వాంగ్మూలం తీసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
 
కాగా, స్వాతి మాలీవాల్‌పై దాడి ఘటనపై కేజ్రీవాల్‌ బుధవారం తొలిసారిగా స్పందించిన సంగతి తెలిసిందే. 'ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుగుతుందని ఆశిస్తున్నా. న్యాయం జరగాలి. ఈ కేసులో రెండు కోణాలు ఉన్నాయి. ఇరుపక్షాల వైపు నిష్పక్షపాతంగా విచారణ జరిపినప్పుడే సరైన న్యాయం అందుతుంది. ప్రస్తుతం ఈ అంశం న్యాయస్థానం పరిధిలో ఉన్నందున.. ఏమీ మాట్లాడలేను' అని ఆయన తెలిపారు. మరోవైపు, తనపై ఉద్దేశపూర్వకంగానే ఆప్‌ నేతలు ఆరోపణలు చేస్తున్నారని స్వాతి దుయ్యబట్టారు. తన వ్యక్తిగత ఫొటోలు లీక్‌ చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.