1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 28 జూన్ 2022 (10:49 IST)

మద్యం సేవించి స్టీరింగ్ పట్టుకుంటే మొండికేస్తుంది...

alcohol device
సాధారణంగా చాలా మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతుంటారు. ఇలాంటి వారి వల్లే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఫలితంగా అనేక మంది మృత్యువాతపడుతున్నారు. మరికొందరు శాశ్వత వికలాంగులుగా మారుతున్నారు. ఈ క్రమంలో జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్‌బాద్‌కు చెందిన ముగ్గురు అధికారులు సరికొత్త ఆల్కాహాలిక్ సెన్సార్ యంత్రాన్ని గుర్తించారు. 
 
కోల్ ఇండియాలో బొగ్గు రవాణా చేసే వాహనాల డ్రైవర్లు.. తరచూ మద్యం సేవించి ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ ప్రమాదాలను చూసిన ఇందులో పని చేసే అజిత్ యాదవ్‌, సిద్దార్థ్ సుమన్, మనీష్ బాల్‌ముచ్చు అనే ముగ్గురు ఇంజనీర్లకు ఒక ఆలోచన వచ్చింది. వెంటనే తన స్నేహితులైన మనీశ్‌, సిద్ధార్థ్‌లతో కలిసి కార్యాచరణ ప్రారంభించారు. వాహనాల్లో మద్యాన్ని పసిగట్టే భద్రతా వ్యవస్థను రూపొందించారు. 
 
'ఆల్కహాల్‌ సెన్సర్‌ ఆధారంగా ఈ పరికరం పనిచేస్తుంది. వాహన చోదకుడు ఆల్కహాల్‌ సేవించాడో? లేదో? అనే విషయాన్ని ఈ పరికరం గుర్తిస్తుంది. డ్రైవర్‌ శ్వాసను విశ్లేషించి సెన్సర్‌కు ఆ సమాచారాన్ని పంపుతుంది. ఆల్కహాల్‌ ఆనవాళ్లు ఉంటే పరికరం డిస్‌ప్లేలో ఆ వివరాలు ప్రత్యక్షమవుతాయి. 
 
ఆ తర్వాత బజర్‌ మోగుతుంది. ఆ సిగ్నల్‌ ఇంధన పంప్‌నకు చేరగానే సరఫరా నిలిచిపోతుంది. ఆల్కహాల్‌ సేవించినట్లు తేలితే.. వాహనం స్టార్ట్‌ అవకుండా అడ్డుకుంటుంది' అని అజిత్‌ యాదవ్‌ తెలిపారు. ఈ పరికరాన్ని మరింతగా ఉన్నతీకరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.