గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 12 ఏప్రియల్ 2019 (09:55 IST)

స్నైపర్ గన్‌తో రాహుల్ గాంధీపై హత్యాయత్నం!

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై హత్యాయత్నం జరిగింది. స్నైపర్ గన్‌తో ఆయనకు కణతకు గురిపెట్టి హత్యాయత్నానికి ప్రయత్నించారు. దీంతో రాహుల్ భద్రతపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తంచేస్తూ, కేంద్ర హోంశాఖామంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఓ లేఖ రాశారు. 
 
ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ లోక్‌సభ స్థానం నుంచి రాహుల్ పోటీ చేస్తున్న విషయం తెల్సిందే. ఆయన గురువారం నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఆ తర్వాత విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. అపుడు తలకు కుడివైపున కణతపై లేజర్‌ లైట్‌ పడటంతో ఈ అనుమానాలు తలెత్తుతున్నాయి. అతి తక్కువ సమయంలో ఏడుసార్లు ఈ లైట్‌ పడినట్లు కాంగ్రెస్‌ వర్గాలు గుర్తించాయి. దీంతో రాహుల్‌ భద్రతకు ముప్పు ఉందని ఆందోళన చెందాయి. 
 
ఈ మేరకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు కాంగ్రెస్‌ నేతలు అహ్మద్‌ పటేల్‌, జైరాం రమేశ్‌, రణ్‌దీప్ సింగ్‌ సూర్జేవాలా లేఖ రాశారు. "రాహుల్‌ మీడియాతో మాట్లాడుతుండగా ఆయన తలపై పచ్చ లైటు వెలుతురు పడింది. కణతపైనే రెండుసార్లు ఈ లైటు పడింది. ఈ వీడియోను పలువురు నిపుణులు, మాజీ భద్రతాధికారులు కూడా పరిశీలించారు. ఆ లైటు స్నైపర్‌ గన్‌ గురిపెట్టడం వల్ల కూడా పడి ఉండవచ్చని అనుమానిస్తున్నాం. దీనిని భద్రతా వైఫల్యంగానే పరిగణిస్తున్నాం. వెంటనే స్పందించి రాహుల్‌ భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం" అని లేఖలో కాంగ్రెస్‌ నేతలు పేర్కొన్నారు. 
 
అయితే, కాంగ్రెస్ అనుమానాలను హోం మంత్రిత్వ శాఖ కొట్టిపారేసింది. రాహుల్‌ భద్రతకు ఎటువంటి ముప్పు లేదని స్పష్టంచేసింది. ఆయన తలపై వెలిగిన పచ్చ లైటు స్నైపర్‌ రైఫిల్‌ నుంచి వెలువడింది కాదని, అది సెల్‌ఫోన్‌ నుంచి వచ్చిన లైటు అని హోంశాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. వాస్తవానికి రాహుల్‌గాంధీ భద్రతలో ఉల్లంఘన జరిగినట్లుగా కాంగ్రెస్‌ నుంచి హోం మంత్రిత్వ శాఖకు ఎలాంటి లేఖ అందలేదన్నారు. అయితే, ఆ వార్తలు తమ దృష్టికి రాగానే వాస్తవ పరిస్థితి గురించి విచారించాల్సిందిగా స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూపు(ఎస్పీజీ) డైరెక్టర్‌ను ఆదేశించామని ఆయన వివరించారు.