శుక్రవారం, 5 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 7 జూన్ 2024 (09:40 IST)

ముగ్గురు బీజేపీ ఎంపీలు మాతో టచ్‌లో ఉన్నారు.. సీఎం మమతా బెనర్జీ

వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు బీజేపీ ఎంపీలు తమతో టచ్‌లో ఉన్నారని అధికార టీఎంసీ అధినేతి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ నేతలు కొట్టిపారేశారు. ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో బెంగాల్ రాష్ట్రంలోని మొత్తం లోక్‌సభ సీట్లకు గాను టీఎంసీ 29 సీట్లు దక్కించుకోగా, బీజేపీకి 12 వచ్చాయి. అయితే, బీజేపీకి చెందిన ముగ్గురు ఎంపీలు తమతో టచ్‌లో ఉన్నారంటూ సీఎం మమతా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు స్పందించారు. తృణమూల్ వ్యాఖ్యల్లో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొంది. 
 
బెంగాల్ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ మొత్తం ఏడు దశల్లో జరిగిన విషయం తెల్సిందే. ఈసారి మమతా బెనర్జీకి బీజేపీ షాక్ ఇస్తుందంటూ ఎన్ని ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించాయి. టీఎంసీ కంటే బీజేపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటుందని అంచనా వేశాయి. కానీ, ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ టీఎంసీ 2019లో వచ్చిన 22 సీట్ల కంటే అదనంగా మరో ఆరు సీట్లను దక్కించుకుని మొత్తం 29 సీట్లను గెలుచుకుంది.