1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 14 జులై 2021 (23:55 IST)

హిజ్రా ఎంత పని చేసింది.. అడిగిన డబ్బివ్వలేదని.. 3నెలల పాపను సజీవంగా...?

ముంబై నగరంలో ఓ హిజ్రా చేసిన దారుణం అందరినీ షాక్‌కు గురిచేసింది. రూ.2వేలు డబ్బులడిగితే ఇవ్వలేదని ఆ దంపతులకు పుట్టిన మూడు నెలల పాపను కిడ్నాప్ చేసి హిజ్రా, మరో ఇద్దరు కలిసి ఆ పసికందును సముద్రపు ఒడ్డున సజీవ దహనం చేసిన ఘటన ముంబైలో వెలుగుచూసింది. ఆ ట్రాన్స్‌జెండర్‌ను, ఈ నేరానికి సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
 
వివరాల్లోకి వెళితే.. ముంబైలోని కఫ్ఫీ పరేడ్ ప్రాంతంలోని అంబేద్కర్ నగర్‌లో సచిన్ చిత్తోల్ కుటుంబం నివాసం ఉంటోంది. ఆ కుటుంబంలో పాప పుట్టిందని తెలుసుకున్న అదే ప్రాంతానికి చెందిన కన్హయ చౌగులే అలియాస్ కణ్ణు(30) అనే హిజ్రా ఆ ఇంటికి వెళ్లింది. గత గురువారం రాత్రి 8 గంటల సమయంలో ఆ ఇంటికి వెళ్లిన కణ్ణు.. ఆ పాపను దీవిస్తానని.. తనకు రూ.1100 డబ్బులతో పాటు ఒక చీర, కొబ్బరికాయను హిందూ సాంప్రదాయం ప్రకారం తనకు ఇవ్వాలని కణ్ణు డిమాండ్ చేసింది. అయితే అంత డబ్బులేదని వారు చెప్పారు. 
 
లాక్‌డౌన్ కారణంగా తనకు పని లేకుండా పోయిందని.. అడిగినంత ఇచ్చుకోలేమని.. ఒక చీర పెట్టి.. కొబ్బరి కాయను ఇచ్చుకుంటామని ఆ కుటుంబం హిజ్రాకు చెప్పింది. అందుకు కణ్ణు ససేమిరా అని డబ్బులివ్వాలని డిమాండ్ చేయడంతో ఆ కుటుంబానికి, హిజ్రాకు మధ్య గొడవ జరిగింది. ఈ గొడవతో హిజ్రా ఆ దంపతులపై ప్రతీకారం తీర్చుకునేందుకు కారణమైంది. అంతే ఆ హిజ్రా అర్థరాత్రి సచిన్ చిత్తోల్ ఇంట్లోకి ప్రవేశించింది. 
 
అందరూ గాఢ నిద్రలో ఉండగా మూడు నెలల వయసున్న చిన్నారిని కిడ్నాప్ చేశారు. కొంతసేపటికి బిడ్డ తల్లికి మెలకువ వచ్చింది. పక్కన పాప లేకపోవడంతో బిడ్డ కనిపించడం లేదంటూ కేకలేసింది. కుటుంబమంతా నిద్రలేచి పాప కోసం వెతికారు. ఎక్కడా ఆ పసికందు జాడ దొరకలేదు. దీంతో.. బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల దర్యాప్తులో హిజ్రానే ఈ పని చేసి ఉంటుందని భావించిన పోలీసులు హిజ్రాను విచారించారు.
 
పోలీసుల విచారణలో ఆ హిజ్రా తొలుత బుకాయించినప్పటికీ.. ఆ తర్వాత అసలు నిజం ఒప్పుకుంది. ఆ పాపను తీసుకెళ్లి తగలబెట్టినట్టు హిజ్రా చెప్పింది. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా ఆ పసికందు మృతదేహం కాలుతూ కనిపించింది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. హిజ్రాను, ఈ నేరానికి సహకరించిన మరో ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. హిజ్రా దాష్టికానికి అభంశుభం తెలియని మూడు నెలల చిన్నారి బలైపోయింది.