1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 జూన్ 2021 (11:04 IST)

ఉపరాష్ట్రపతి వెంకయ్యకు షాకిచ్చిన ట్విట్టర్.. ఆ గుర్తు తొలగింపు!

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి మైక్రోబ్లాగింగ్ సంస్థ ట్విట్టర్ షాకిచ్చింది. ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్యనాయుడు వ్య‌క్తిగ‌త అకౌంట్ నుంచి బ్లూ టిక్ లేదా వెరిఫైడ్ బ్యాడ్జ్‌ను తొల‌గిస్తూ అనూహ్య నిర్ణయం తీసుకుంది. దీనికి కారణాన్ని కూడా తెలిపింది. గత ఆరు నెల‌లకుపైగా ఈ అకౌంట్ (@MVenkaiahNaidu) ఇన్‌యాక్టివ్‌గా ఉండ‌టం వ‌ల్లే ట్విట‌ర్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు పేర్కొంది. ఈ విషయాన్ని ప్ర‌ముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ వెల్ల‌డించింది. 
 
అయితే, ఉప‌రాష్ట్ర‌ప‌తి అధికారిక అకౌంట్ @VPSecretariatకు మాత్రం బ్లూటిక్ అలాగే ఉంది. అయితే ఆయ‌న వ్య‌క్తిగ‌త‌ అకౌంట్‌కు వెరిఫైడ్ స్టేట‌స్ తీసేయ‌డంపై అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌డంతో ట్విట్టర్ తిరిగి బ్లూటిక్ ఇవ్వ‌నున్న‌ట్లు ఉప‌రాష్ట్రప‌తి కార్యాల‌యం వెల్ల‌డించింది. 
 
ఈ అకౌంట్ నుంచి వెంక‌య్య‌నాయుడు చివ‌రిసారి 2020, జులై 23న ట్వీట్ చేశారు. ట్విట్ట‌ర్ ఇచ్చే ఈ బ్లూటిక్ లేదా వెరిఫైడ్ బ్యాడ్జ్ వ‌ల్ల ఇది అధికారిక‌, గుర్తింపు పొందిన‌, యాక్టివ్‌గా ఉన్న అకౌంట్‌గా ధృవీక‌రించుకోవ‌చ్చు. ప్ర‌ముఖ వ్య‌క్తులు, బ్రాండ్ల‌కు మాత్రమే ట్విట‌ర్ ఈ గుర్తింపు ఇస్తుంది.