1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 27 ఫిబ్రవరి 2024 (11:14 IST)

భద్రత లేకుండా బెంగుళూరు వీధుల్లో బ్రిటన్ ప్రథమ మహిళ

akshitha murthy
ఆమె బ్రిటనే దేశ ప్రధానమంత్రి సతీమణి, బ్రిటన్ ప్రథమ పౌరురాలు. అలాంటి మహిళకు ఎంతో కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. కానీ, ఆమె ఎలాంటి భద్రత లేకుండా, కించిత్ భయం అనేది లేకుండా బెంగుళూరు వీధుల్లో ఎంచక్కా షాపింగ్ చేస్తున్నారు. ఆమె ఎవరో కాదు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సతీమణి అక్షతా మూర్తి. 
 
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుటుంబం బెంగళూరు వీధుల్లో పర్యటించింది. ఆయన తన సతీమణి సుధామూర్తి, కుమార్తె, యూకే ప్రథమ మహిళ అక్షతా మూర్తి, మనవరాళ్లతో కలిసి రాఘవేంద్ర మఠ్‌కు వెళ్లారు. సామాన్య ప్రజల వలే రోడ్డుపై దుకాణాల వెంట తిరుగుతూ మార్కెట్లోకి కొత్తగా వచ్చిన పుస్తకాలను పరిశీలించారు. ఆ సమయంలో వారి దగ్గరులో ఎలాంటి భద్రతా లేకపోవడం గమనార్హం. ఇప్పుడు దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 
 
ఈ వీడియో సరిగ్గా ఎప్పుడు తీశారో స్పష్టత లేనప్పటికీ.. వారి నిరాడంబరతకు మరోసారి ప్రశంసలు కురుస్తున్నాయి. ఇటీవల ఇలాంటి దృశ్యమే ఒకటి వెలుగులోకి వచ్చింది. బెంగళూరులోని ఒక పాపులర్ ప్లేస్‌లో ఐస్‌క్రీమ్‌ను ఆస్వాదిస్తూ ఈ తండ్రీకుమార్తె కనిపించారు. నవ్వుతూ ఫొటోలకు పోజులిచ్చారు.
 
అలాగే ఇటీవల అక్షత ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. 'యాన్‌ అన్‌కామన్ లవ్‌: ది ఎర్లీ లైఫ్ ఆఫ్ సుధా అండ్ నారాయణ మూర్తి' పేరిట చిత్రా బెనర్జీ అనే రచయిత ఆ పుస్తకాన్ని రచించారు. గత ఏడాది జరిగిన జీ20 శిఖరాగ్రసదస్సులో భాగంగా తన భర్త, యూకే పీఎం రిషి సునాక్‌తో కలిసి అక్షత మనదేశంలో పర్యటించిన సంగతి తెలిసిందే.