శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 1 మార్చి 2021 (12:39 IST)

నగ్నంగా పూజలు చేస్తే కోట్లు వశమవుతాయన్నారు.. మైనర్ బాలిక ఏం చేసిందంటే?

నగ్నంగా పూజలు చేస్తే కోట్లు నీ వశం అవుతాయని ఓ మైనర్ బాలికను నమ్మించారు కొందరు వ్యక్తులు. పూజ సమయంలో దుస్తులు విప్పి పూజలు చేయాలని ఆ బాలికపై ఒత్తిడి తెచ్చారు. కానీ విషయం పసిగట్టిన బాలిక ఎలాగోలా అక్కడి నుండి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి మైనర్ బాలికను కలిసి తాను చెప్పినట్లు చేస్తే క్షణాల్లో ధనవంతురాలు అవుతావని, రూ.50 కోట్లు డబ్బు వర్షం కురుస్తుందంటూ నమ్మబలికాడు. అందుకోసం కొన్ని పూజలు చేయాలని పేర్కొన్నారు. అది నమ్మిన బాలిక.. పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు అంగీకరించింది. 
 
అయితే, పూజా కార్యక్రమాలు నిర్వహించే సమయంలో బాలిక దుస్తులు విప్పాలని సదరు వ్యక్తి చెప్పాడు. దాంతో పరిస్థితిపై అనుమానం వ్యక్తం చేసిన బాలిక ససేమిరా అంది. కానీ, డబ్బులు కావాలంటే దుస్తులు విప్పాల్సిందే అంటూ సదరు వ్యక్తి తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చారు.
 
దాంతో బాలిక వారి చెర నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది. జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించింది. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఐదుగురిని అరెస్ట్ చేశారు.