బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 ఏప్రియల్ 2020 (16:07 IST)

కరోనా-మనీ అవసరం.. స్టాచ్యూ ఆఫ్ యూనిటీని ఓఎల్ఎక్స్‌లో అమ్మబడును

కరోనా వైరస్ పై యుద్ధం ప్రకటించిన ప్రధాని మోడీ.. కరోనా మహమ్మారిపై పోరాటం కోసం పీఎమ్ కేర్స్‌ ఫండ్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. విరాళాలు ఇవ్వాలని దేశ ప్రజలను ప్రధాని మోడీ కోరారు. దీంతో పీఎం కేర్స్‌కు విరాళాలు వెల్లువెత్తాయి. పలువురు రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు విరాళాలు అందిస్తున్నారు. ఈ విరాళాలు సరిపోవని ఓ వ్యక్తి అనుకున్నాడో ఏమో కానీ, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహాన్ని ఓఎల్ ఎక్స్‌లో అమ్మకానికి పెట్టేశాడు.
 
భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు అంకితమిస్తూ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహాన్ని 2018 అక్టోబర్ 31న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహం ఇది. దీని ఎత్తు 182 మీటర్లు. ఈ విగ్రహాన్ని 'స్టాట్యూ ఆఫ్ యూనిటీ' అని పిలుస్తారు. గుజరాత్‌లోని నర్మదా నదీ తీరంలోని సాధు బెట్ అనే చిన్న దీవిలో దీన్ని నిర్మించారు. 
 
'సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ ఇంటిగ్రేషన్ ట్రస్ట్' ఈ స్టాట్యూ ఆఫ్ యూనిటీ ప్రాజెక్టును చేపట్టింది. అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీతో(93 మీటర్లు) పోలిస్తే ఈ విగ్రహం రెండింతలు ఎత్తైనది. 2012-13లో ప్రారంభమైన ఈ భారీ ప్రాజెక్ట్ 2018 లో పూర్తయింది. ఈ నేపథ్యంలో స్టాచ్చూ ఆఫ్ యూనిటీ విగ్రహం అమ్మబడును.. అంటూ గుర్తు తెలియని వ్యక్తి ఓఎల్ ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టాడు. 
 
ఇది కావాలనుకున్న వారు రూ.30వేల కోట్లు చెల్లిస్తే సరిపోతుందని చెబుతూ ఓ మేసేజ్ కూడా పెట్టాడు. కరోనాతో హెల్త్ కేర్ కోసం అర్జెంట్‌గా మనీ అవసరం కావడంతో దీన్ని అమ్మకానికి పెడుతున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ అవుతోంది.