శనివారం, 12 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 ఏప్రియల్ 2025 (10:53 IST)

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

kerala company
కేరళ రాష్ట్రంలోని ఓ ప్రైవేటు మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్యకు పాల్పడింది. తమ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో సరైన ప్రతిభను చూపని ఉద్యోగులను కుక్కలతో సమానంగా చూసింది. ఉద్యోగుల మెడకు గొలుసుకట్టి కుక్కల్లా నడిపించింది. నేలపై నాణేలను పడేసిన వాటిని నాలుకతో తీయించింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో టీవీ చానెల్‌లో ప్రసారం కావడంతో సదరు కంపెనీపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. 
 
ఈ ఘటనపై స్పందించిన కేరళ కార్మిక శాఖామంత్రి శివన్ కుట్టి ఆ కంపెనీపై విచారణ జరిపిన వెంటనే నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పోలీసులు కూడా రంగంలోకి దిగారు. అయితే, కంపెనీ మాత్రం దీనిని కొట్టిపడేసింది. టీవీ ఫుటేజీల్లో కనిపించిన ఉద్యోగి మీడియాతో మాట్లాడుతూ తమ కంపెనీ అలాంటి వేధింపులకు పాల్పడలేదని ఆ దృశ్యాలు ఇప్పటివికావని, కొన్ని నెలల కిందటివని చెప్పారు.
 
అప్పట్లో మేనేజరుగా ఉన్న వ్యక్తి బలవంతంగా అలా చిత్రీకరించారని, యాజమాన్యం ఆయనను తొలగించిందని పేర్కొన్నారు. దీంతో ఇపుడు కావాలనే ఆ వీడియోలను బయటపెట్టారని వివరిస్తూ కార్మికశాఖ, పోలీసుల ముందు కూడా ఆయన ఇదే వాంగ్మూలం ఇచ్చారు. 
 
అయితే, మరికొందరు ఉద్యోగులు మాత్రం లక్ష్యాలను సాధించడంలో విఫలమైన వారికి మాత్రం ఇలాంటి శిక్షలు విధించడం నిజమేనని చెప్పారు. సంస్థ యాజమాన్యం మాత్రం ఈ ఆరోపణలు కొట్టిపారేసినట్టు పోలీసులు కూడా తెలిపారు. హైకోర్టు న్యాయవాది ఫిర్యాదుతో రాష్ట్ర మానవహక్కుల సంఘం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.