1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 జనవరి 2024 (12:23 IST)

తాంత్రికుడి దెబ్బలు తాళలేక 34 ఏళ్ల మహిళ మృతి

మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ తాంత్రికుడి దెబ్బలు తాళలేక 34 ఏళ్ల మహిళ మృతిచెందింది. వివరాల్లోకి ఝబువా జిల్లాలో నాగన్‌వత్ గ్రామానికి చెందిన మంజిత అనే మహిళకు పెళ్లయ్యి 15 ఏళ్లు గడిచినా పిల్లలు లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఓ తాంత్రికుడి వద్దకు తీసుకెళ్లారు. తంత్ర ప్రక్రియలో భాగంగా అతడు వరుసగా మూడు రోజులపాటు మంజితను కొట్టడంతో ఆమె తీవ్ర గాయాలతో బుధవారం మృతి చెందింది. 
 
దెయ్యం పట్టిందంటూ తాంత్రికుడు భూతవైద్యం మొదలుపెట్టాడు. తంత్ర ప్రక్రియలో భాగంగా ఆమెను కొట్టడం మొదలుపెట్టాడు. దెబ్బలు తాళలేక మూడవ రోజు ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించేలోగానే ఆమె మృతి చెందింది. 
 
పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు మొదలుపెట్టినట్టు పోలీసులు వెల్లడించారు.