అమెరికా డేలావేరలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు
అమెరికాలోని డేలావేర రాష్ట్రంలోని హిందు దేవస్థానంలో ఇటీవల షిర్డీ సాయి గురుపౌర్ణమి షిర్డీ సాయి గురుపూర్ణిమ వేడుకలతో పాటు షిర్డీ సాయి గ్రూప్ రెండవ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. డేలావేర రాష్ట్రంలో తొలిసారిగా మహాలక్ష్మి దేవస్థానంలో జరిగిన షిర్డీ సాయి పూజలకి అనూహ్యమైన స్పందన వచ్చింది.
దాదాపు 200 మంది భక్తులు వేడుకలకి హాజరయ్యారు. బాబా భజనలకి భక్తులు భక్తి పారవశ్యంలో పులకరించిపోయారు. గురుపౌర్ణమి ఆ షిర్డీ సాయినాధునికి అత్యంత ప్రియమైన రోజు అని తను మహాసమాధి చెందుతూ ఆరోజు తనని పూజించమని చెప్పిన రోజు అని, ఆ రోజు పూజించి గురువుగా స్వీకరించినవారిని జన్మజన్మలకి ఆయన ఆశీస్సులు అందజేస్తారని ఆలయ పూజారి తెలిపారు.
అంనతరం బాబా ఆరతులు, అభిషేకం, బాబా రథయాత్ర జరిగాయి. పదకొండు రకాల నైవేద్యాలతో మహాప్రసాదం పంచిపెట్టారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన బాబా భక్తులందరికీ షిర్డీ సాయి గ్రూప్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.