గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 29 జూన్ 2015 (14:43 IST)

'తానా' మహాసభల భద్రతా విభాగం విశేషాలు

20వ తానా మహాసభలు డిట్రాయిట్ కోబో హాలులో జూలై 2 నుండి 4వ తేదీ వరకు జరుగనున్నవి. పదివేల మందికిపైగా దేశ విదేశాల నుండి ఈ మహాసభలకు హాజరుకానున్నారు. ఈ సభలలో ప్రణాళికాబధ్ధంగా నిర్వహించే సాహితీ, సాంస్కృతిక, వాణిజ్య, ఆధ్యాత్మిక, ధీంతాన తదితర కార్యక్రమాలు నిర్వహించడానికి, క్రమబధ్ధం చేయడానికి, రక్షణ వ్యవస్థను పటిష్ఠంగా ఉంచడానికి తానాలో ప్రత్యేక విభాగం పని చేస్తున్నది.
 
ఈ సెక్యురిటీ కమిటీ అధ్యక్షులుగా మహీధర రెడ్డి, నరేష్ కొల్లి, శ్రీనివాస కొండ్రగుంట కో-చెయిర్లుగా, సభ్యులతో కలసి కార్యక్రమాల పర్యవేక్షణను, పటిష్టమైన బందోబస్తు కొరకు కమిటీ సన్నాహాలు చేస్తున్నారు. సభా కార్యక్రమాల నిర్వహణకు సేవా సైన్యంగా పనిచేసే భద్రతా విభాగ సేవలు అత్యంత ఆవశ్యకం. దీనిని దృష్టిలో పెట్టుకొని కోబో హాలులో ప్రధాన వేదిక, పలు ఇతర వేదికలు, రిజిస్ట్రేషన్ తదితర విషయాలలో కమిటీల అండగా నిలచే సెక్యూరిటీ విభాగం నిర్వహణ, పర్యవేక్షణ ఈ కమిటీ బాధ్యతలుగా చర్యలు చేపడుతున్నది. 
 
కమిటీ పలుమార్లు సమావేశమై సభలకు వాలంటీర్లను సిధ్ధం చేస్తున్నది. నగర సెక్యూరిటీ సంస్థలతో చర్చలు జరిపి ఏర్పాట్లు పూర్తిచేస్తున్నది. సమావేశాలకు వచ్చే తెలుగువారందరూ కార్యక్రమాలు జయప్రదం కావడానికి తమతో సహకరించవలసినదిగా సెక్యూరిటీ కమిటీ భద్రతా విభాగం విజ్ఞప్తి చేస్తున్నది.