శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 10 డిశెంబరు 2019 (15:25 IST)

శార్వరినామ సంవత్సర ఫలితాలు.. ఆంధ్రప్రదేశ్‌కు సమస్యలుండవ్..

ఈ సంవత్సర గ్రహస్థితిని పరిశీలించగా 29-03-2019 వరకు ధనుర్ రాశిలో గురు సంచారం తదుపరి మకర రాశిలో ప్రవేశించి వక్రగతిన 29-06-20 నందు ప్రవేశించును. 20-11-2020 నందు మకరరాశి నందు ప్రవేశించి సంవత్సరం అంతా సంచరించును.
 
శని ఈ సంవత్సరం అంతా మకరరాశి నందు సంచరించును. రాహు, కేతువులు సంవత్సరం ఆరంభం నుంచి సెప్టెంబర్ 23 వరకు మిథునం, ధనుస్సు, వృషభ, వృశ్చికం నందు ప్రవేశించి ఈ సంవత్సరం అంతా సంచరించును. 
 
ఈ గోచారం ప్రకారం ఆంధ్ర రాష్ట్రానికి ఆశించినంత అభివృద్ధి లేకపోయినప్పటికీ సమస్యలు ఉండవు. రాజకీయ నాయకులు ఆటుపోట్లకు గురవుతారు. అనవసర ధన వ్యయం తరచూ అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వ్యాపారాభివృద్ధి, స్టాక్ మార్కెట్ అభివృద్ధి పథకంలో నడుస్తుంది. బ్యాంకులు, ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరుగుతాయి. 
 
కుజ వీక్షణంచే స్టాక్ మార్కెట్ రంగానికి ఒడిదుడుకులెదురవుతాయి. ప్రతీ కుటుంబంలో తరచు సఖ్యత లోపం, వివాదాలు చెలరేగుతాయి. తృతీయ వ్యయాధిపతి అయిన బుధుడు అష్టమ స్థితిచే పర్యాటకశాఖ ప్రసారరంగాల యందు ఆటంకాలెదురవుతాయి. 
 
చతుర్థ లాభాధిపతి అయిన శుక్రుడు రాజ్య కేంద్రం నుంచి చతుర్థ స్థానమును వీక్షించడం వల్ల గృహ నిర్మాణ శాఖలు, భూగర్భ గనులు, వ్యవసాయము, పాడి పరిశ్రమలు, పంటలు అభివృద్ధి పథంలో ఉంటాయి. శని వీక్షణచే విద్యా రంగంలో అవకతవకలు ఉన్నప్పటికీ విద్యా సంస్థల పనితీరు బాగుంటుంది. విద్య, వైజ్ఞానిక విషయాలు, సాంఘిక వసతి గృహాలు అనుకున్నంత ప్రగతిని సాధించలేవు. 
 
కళాకారులకు, చలనచిత్ర పరిశ్రమ, క్రీడా రంగములకు ఏమాత్రం ప్రోత్సాహం ఉండదు. రాహు, కేతువు వీక్షణంచే పోలీసు, రక్షణ శాఖలు బాగుగా పనిచేస్తాయి. దేశ రక్షణకు ప్రభుత్వ శ్రద్ధ చూపును. ఉద్యోగ జీత భత్యములు రావలసిన క్లయింలు సకాలంలో చెల్లించబడతాయి. సైనిక యుద్ధ నావీక పనితీరులు అమోఘములు. ఇతర దేశాలతో సంబంధ బాంధవ్యాలు అంతంత మాత్రంగా వుంటాయి. 
 
రాజ్యాధిపతి అయిన శుక్రుడు రాజ్య, కేంద్ర స్థితి నుంచి గురు వీక్షణచే ప్రభుత్వ దేవాలయాల్లో ఆదాయం పెరుగును. నేరాల సంఖ్య తగ్గును, వ్యయ స్థానము నందు రాహు స్థితి గురు వీక్షణచే కొంత అనవసర వ్యయం ప్రజలు విలాసాలకు వ్యయం చేస్తారు. చట్టాల్లో మార్పుల వల్ల స్త్రీలకు కొంత మేర రక్షణ కలుగుతుంది. 
 
నిత్యావసర వస్తువులు కంది, మినుము, మిర్చి, చింతపండు, వేరుశెనగ, పెసలు, శనగలు ధరలు తారాస్థాయికి పెరుగుతాయి. కొత్త కొత్త వ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విదేశాలు వెళ్లే వారికి అనుకోని ఇబ్బందులను ఎదురవుతాయి. 
 
వివాహ సంబంధిత విషయంలో అసంతృప్తి అధికం. పురుష సంతతి అధికంగా వుంటుంది. ఆగస్టు, సెప్టెంబర్, నవంబర్ ప్రాంతాల్లో అధిక వర్షపాతం, వరదలతో లోతట్టు ప్రాంతాలు జలమయమవుతాయి. న్యాయస్థానాల యందు, దేవాలయ కార్యక్రమాల యందు తలదూర్చడం వల్ల ప్రజలలో వ్యతిరేక భావం అధికమవుతుంది. 
 
బంగారం, వెండి ధరలు అధికమవుతాయి. ఇసుక, సిమెంట్, కలప వ్యాపారస్తులకు ఆశాజనకం. కాంట్రాక్టర్లకు పనివారితో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రజలలో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్వామీజీలు, బాబాలతో అప్రమత్తంగా వుండాలి. ఆలయాల ఆదాయం బాగుంటుంది. నిరుద్యోగులకు చక్కని అవకాశాలు లభిస్తాయి. 
 
మన రాష్ట్రంలో కొత్త కొత్త పథకాలు దినదినాభివృద్ధి చెందుతాయి. దక్షిణ భాగం నుంచి తుఫాను రావడానికి ఆస్కారం వుంది. ఆదాయపన్ను శాఖ అధికారులకు శ్రమాధిక్యత. ప్రకృతి సిద్ధమైన ఔషధ గుణాలు కలిగిన వైద్యం మెరుగుపడుతుంది. విద్యార్థిని, విద్యార్థులకు ఎలక్ట్రానిక్ రంగాల, ఫోటోగ్రఫీ, యానిమేషన్ రంగాల యందు ఆసక్తి చూపిస్తారు. 
 
మీడియా రంగాల వారికి అనుకోని ఎదురుదెబ్బలు తగులుతాయి. వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించండి. రోడ్డు ప్రమాదాలు అధికంగా వుంటాయి. కొత్త కొత్త అనారోగ్యాలు, కేన్సర్, కిడ్నీ, షుగర్, గుండెకు సంబంధించిన వ్యాధులు అధికమవుతాయి. డాక్టర్లకు శ్రమ అధికమవుతుంది. మొత్తం మీద ఈ సంవత్సరం అంతా మిశ్రమ ఫలితంగా వుంటుంది. 
 
శ్రీమతి  పి. ప్రసూనా రామన్ 
జ్యోతిష్య విజ్ఞాన భారతి, 
మహిళా జ్యోతిష్య రత్న
సత్యనారాయణపురం, విజయవాడ.