సూతకంలో శుభకార్యానికి వెళ్లవచ్చా?
సూతకం. దగ్గరి బంధువు చనిపోయినప్పుడు లేదా సూతకంలో శుభకార్యానికి వెళ్లవచ్చా లేదా అనే సందేహంలో వుంటుంటారు. దగ్గరి బంధువు చనిపోతే శుభకార్యానికి వెళ్లకూడదు. హిందూ సంప్రదాయం ప్రకారం, కుటుంబంలో దగ్గరి బంధువులు మరణించినప్పుడు, ఆ కుటుంబానికి సూతకం లేదా మైల ఉంటుంది.
కుటుంబంలో ఎవరైనా మరణించినప్పుడు సుమారు 10 నుండి 13 రోజులు మైల ఉంటుంది. ఈ సమయంలో, ఆ కుటుంబంతో దగ్గరి సంబంధం ఉన్నవారు ఇతరుల శుభకార్యాలలో పాల్గొనడం, దేవాలయాలకు వెళ్లడం వంటివి చేయకూడదు. అలా పాటించకుండా శుభకార్యానికి వెళితే, వెళ్లినవారి ద్వారా సూతకం లేదా మైల ఆ శుభకార్యానికి, ఆ ఇంటికి అంటుతుందని నమ్ముతారు. ఇది ఆ శుభకార్యం యొక్క పవిత్రతకు ఆటంకం కలిగించవచ్చు.
అందువల్ల శుభకార్యానికి రాలేకపోతున్నట్లు సదరు శుభకార్యం జరిపే వారికి ఫోన్ చేసి, జరిగిన విషాదాన్ని వివరిస్తూ, అందుకే రాలేకపోతున్నామని మర్యాదగా తెలియజేయాలి. మైల గడువు ముగిసిన తరువాత... అంటే సుమారు 13 రోజుల తర్వాత ఆ ఇంటికి వెళ్లి వారిని పలకరించి, బహుమతి లేదా ఆశీర్వాదాలను పంపవచ్చు. కాబట్టి, దగ్గరి బంధువు చనిపోయినప్పుడు ఎలాంటి శుభకార్యానికి వెళ్లకపోవడం సంప్రదాయాలను అనుసరించి సరైన నిర్ణయం.