బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 18 మార్చి 2021 (23:02 IST)

సాక్షాత్తు పరమేశ్వరుడు తెల్లవారు జామున ఇక్కడ స్నానమాడతారట

హిమాలయాల్లోని మానస సరోవరము బ్రహ్మ సృష్టి అని విశ్వాసం. 352 చదరపు అడుగుల వైశాల్యం, 300 అడుగుల లోతు, చుట్టు కొలత 82 మైళ్లు వుంటుందని అంచనా. సరస్సును చుట్టి రావడం కష్టం. ఈ సరస్సులో దేవతలు తేజోరూపాల్లో వచ్చి స్నానం చేసి వెళతారట.
 
సాక్షాత్తూ పరమేశ్వరుడు తెల్లవారు జామున పవిత్ర జలాల్లో స్నానమాడతారట. ఈ నీరు స్వచ్ఛంగా తియ్యగా వుంటుంది. సాక్షాత్తు దేవగంగ, ఇంద్రాది దేవతలు తిరుగాడు చోటు. సరస్సులో నీరు క్షణక్షణం రంగులు మారుతుంటుంది. సూర్యోదయ, సూర్యాస్తమయ దృశ్యాలు అత్యంత మనోహరంగా వుంటాయిక్కడ.
 
కైలాసగిరికి ఎన్నో పేర్లున్నాయి. హేమాద్రి, రజతాద్రి, సుషుమ్న కనకాచలము, దేవ పర్వతము, అమరాద్ర, సుమేరు అనే పేర్లతో విరాజిల్లుతుంది. ఈ పర్వత రాజము పురాణ ప్రసిద్ధము. పరమేశ్వరుడు ఈ వెండికొండపై వేంచేసి త్రిలోకాలను రక్షిస్తున్నాడు. జగదాంబ, పార్వతీ దేవి, సర్వమంగళగా సర్వజగత్తును తన మహిమోన్నతమైన శక్తి చేత కాపాడుతుంది. ఈ పర్వతానికి శ్రీచక్రమని కూడా పేరు. ఇది జ్ఞానానికి, మోక్షానికి గుర్తుగా భావిస్తారు. జైనులు ఈ కొండను ఆదినాథ క్షేత్రమని పేరు పెట్టారు.
 
ఇది శివుని తాండవలీలా ప్రదేశం. ఈ కొండ వింతవింతలుగా, వెండి, బంగారు కాంతులతో ప్రకాశిస్తుంటుంది. నటరాజు యొక్క నాట్యలీలా విలాస కేంద్రం అంటూ మునులు, రుషులు కీర్తిస్తారు. ఎంతో ప్రయాసలకు లోనై ఈ ప్రయాణం చేయాల్సి వుంటుంది. ఆర్థిక భారంతో పాటు శారీరక బాధలెక్కువ. ఆరోగ్యంగా వున్నవారే ప్రయాణం చేయాలి. మానస సరోవరంలో స్నానం ఆత్మానందం కలిగిస్తుంది. ఆత్మశుద్ధికి తోడ్పడుతుంది. జీవితంలో ఒక్కసారైనా మానస సరోవరం దర్శించి పరమేశ్వరుని అపార కరుణాకటాక్షాలు పొందాలని ప్రార్ధిద్దాం.