శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 12 జులై 2021 (20:53 IST)

భక్తులు లేకుండానే నిరాడంబరంగా పూరీ జగన్నాథ యాత్ర

Rath Yatra 2021
దేశ వ్యాప్తంగా జగన్నాథుని రథయాత్ర ప్రారంభమైంది. కరోనా కారణంగా ఈ ఏడాది కూడా పూరీ జగన్నాథుని రథయాత్ర భక్తులు లేకుండానే నిరాడంబరంగా జరుగుతోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఒడిశా రాష్ట్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. 
 
రథయాత్ర వేళ పూరీలో రెండు రోజుల పాటు కర్ఫ్యూ విధించింది. భక్తులు పూరీ రాకుండా రైళ్లు, బస్సులు నిలిపివేసి, పట్టణంలో కర్ఫ్యూ విధించినట్లు పోలీసులు తెలిపారు. అలాగే పూరీలోని శ్రీక్షేత్ర యంత్రాంగం, వివిధ శాఖల ఉన్నతాధికారులు.. నిరాడంబరంగా వేడుక నిర్వహిస్తున్నారు. ఆనవాయితీ ప్రకారం నందిఘోష్, తాళధ్వజ్, దర్పదళన్ రథాలపై జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర, సుదర్శనుడు శ్రీక్షేత్రం వీడి పెంచిన తల్లి గుండిచా మందిరానికి బయల్దేరారు. 
 
ఈ నేపథ్యంలో కోవిడ్ వ్యాప్తి కారణంగా భక్తులంతా ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని, ఏ ఒక్కరూ కూడా రథయాత్రను ప్రత్యక్షంగా వీక్షించేందుకు రావద్దని ఆలయ ప్రధాన సేవకులు కోరారు. ప్రజలంతా ఎవరి ఇళ్లలో వాళ్లు ఉండి టీవీల్లో ప్రత్యేక్ష ప్రసారం ద్వారా రథయాత్రను వీక్షించాలని సూచించారు. కరోనా మహమ్మారి కారణంగా ఈసారి రథయాత్రకు భక్తులను అనుమతించడంలేదు ప్రభుత్వం. 
 
కేవలం అర్చకులు, ఆలయ సిబ్బంది మాత్రమ రథయాత్రలో పాల్గొనున్నారు. వీరితోపాటు ఎంపిక చేసిన కొద్ది మంది భక్తులను రథం లాగేందుకు అనుమతి ఇచ్చారు. వారికి ముందుగానే కోవిడ్ టెస్టుతో పాటు కరోనా వ్యాక్సిన్‌ కూడా వేశారు. గతేడాది సుప్రీంకోర్టు జారీ చేసిన అన్ని మార్గదర్శకాలను ఈసారి కూడా పాటించనున్నట్లు అధికారులు తెలిపారు. రెండు డోసుల టీకా వేసుకున్న ఐదు వందల మంది సేవలకు మాత్రమే రథాన్ని లాగేలా చర్యలు తీసుకున్నారు.