ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (23:06 IST)

శ్రీవారి క్షేత్ర వైభవాన్ని తెలిపే టేబుల్ బుక్.. ఎలా ఉంటుందంటే?

తిరుమల క్షేత్ర వైభవాన్ని, ప్రాశస్త్యాన్ని కళ్లకు కట్టినట్లు తెలిపే కాఫీ టేబుల్ బుక్ టీటీడీ మొట్టమొదటి సారిగా ఆవిష్కరించబోతుంది. తమిళనాడుకు చెందిన ఆర్కెటిక్ మరియు ఫోటోగ్రఫీలో నిపుణులైన రమణన్, వ్రిందా దంపతులు  రూపొందించిన మొదటి కాపీని ఇవాళ శ్రీవారి పాదాల చెంత ఉంచి పూజలు నిర్వహించారు. 
 
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల పుణ్యక్షేత్రం గురించి సుస్పష్టంగా, ఆకట్టుకునేలా తిరుమల తిరుమల దేవస్థానం మొట్టమొదటి సారి కాఫీ టేబుల్ బుక్‌ని భక్తుల కోసం తీసుకొస్తుంది. ఆ పుస్తకంలో క్షేత్ర చరిత్ర, స్థల పురాణం, భక్తాగ్రేసులైన ఆళ్వార్లు సేవలు, భక్తుల నమ్మకాలు, స్వామివారి ఉత్సవాలు ఇలా నాటి నుండి నేటి వరకు తిరుమల దినదినాభివృద్ధి చెందిన తీరుతో పాటు ప్రతి ఒక్క అంశాలతో కూడా ఐదు వందల పేజీల కాఫీ టేబుల్ బుక్‌ను కలియుగ వైకుంఠం పేరుతొ  తమిళనాడు రాష్ట్రం శ్రీరంగంకు చెందిన రమణన్, వ్రిందా అనే దంపతులు రూపొందించారు.
 
ఇప్పటివరకు కూడా మన దేశానికి సంబంధించి రాష్ట్రపతి భవన్, ప్రధానమంత్రి కార్యాలయం, రాష్ట్ర అసెంబ్లీలు, పురాతన రాజకోటలకు మాత్రమే కాఫీ టేబుల్ బుక్ ఉందని మనకు తెలుసు. అయితే ప్రపంచంలోని కోట్లాది మంది భక్తులు ఉన్న తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించిన విశేషాలతో కూడిన ఒక కాఫీ టేబుల్ బుక్‌ను రూపొందించే అదృష్టం తమకు కలగడం చాలా ఆనందంగా ఉందంటున్నారు బుక్‌ని రూపొందించిన ఆ దంపతులు.
 
టిటిడి మాజీ అనిల్ కుమార్ సింఘాల్ హయాంలో చేపట్టిన ఈ ప్రాజెక్టు దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఇటీవల కాలంలో పూర్తి చేశారు. మొదట ప్రచురణను ఇవాళ తిరుమలకు తీసుకొచ్చి స్వామివారి చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేయించారు, అనంతరం ప్రస్తుత ఈఓ జవహర్ రెడ్డికి బుక్‌ని చూపించగా, ఆయన ఆ పుస్తకం డిజైన్లు చూసి అందులో ఉన్న విశేషాలను పూర్తిగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ యేడాది ఉగాది రోజున ఈ పుస్తకాన్ని తిరుమలలో టీటీడీ అధికారుల చేతుల మీదుగా ఆవిష్కరించబోతున్నట్లు వారు తెలిపారు.