1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 5 అక్టోబరు 2021 (20:26 IST)

రెజ్లర్ సుశీల్ కుమార్‌కు బెయిల్ నిరాకరణ

ఒలింపిక్‌ పతక విజేత రెజ్లర్ సుశీల్ కుమార్ ఢిల్లీ కోర్టు మంగళవారం బెయిల్ నిరాకరించింది. ఛత్రసాల్ స్టేడియంలో జరిగిన హత్య కేసులో ప్రాసిక్యూషన్, డిఫెన్స్ వాదనలు విన్న తర్వాత అదనపు సెషన్స్ జడ్జి శివాజీ ఆనంద్.. సుశీల్‌ కుమార్‌కు బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించారు.

పోలీసులు తనపై తప్పుడు కేసు బనాయించారని, తనను అపరాధిగా చిత్రీకరించారని రెజ్లర్‌ సుశీల్‌ కుమార్ కోర్టుకు తెలిపి.. బెయిల్‌ ఇవ్వాల్సిందిగా విన్నవించారు.
 
38 ఏండ్ల వయసున్న సుశీల్‌ కుమార్‌ తోటి మాజీ జూనియర్‌ రెజ్లింగ్‌ ఛాంపియన్‌ సాగర్‌ ధంకర్‌ను కొట్టి చంపాడన్న ఆరోపణలపై మే 23 న పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం జూన్ 2 నుంచి జైలులో ఉన్నాడు. 
 
సుశీల్‌కుమార్‌-సాగర్ ధంకర్ మధ్య ఆస్తికి సంబంధించి వాగ్వాదం జరుగడంతో సాగర్‌పై సుశీల్‌ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సాగర్‌ ధంకర్ దవాఖానలో చికిత్స పొందుతూ మరణించాడు. సెరిబ్రల్‌ డ్యామేజ్‌ కారణంగా సాగర్‌ ధంకర్‌ చనిపోయాడని పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించింది.