1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 22 ఏప్రియల్ 2024 (15:14 IST)

లిక్కర్ స్కామ్ కేసు : కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పు వాయిదా!!

k kavitha
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే కె.కవితను సీబీఐ అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆమె ఢిల్లీ తీహార్ జైలులో విచారణ ఖైదీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మే నెల 2వ తేదీకి వాయిదా వేసింది. అలాగే, ఈడీ అరెస్టుపై ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ కొనసాగుతుంది. 
 
ఈ నేపథ్యంలో సీబీఐ కేసులో మాత్రం విచారణలు పూర్తయినప్పటికీ తీర్పును మాత్రం మే 2వ తేదీకి వాయిదా వేసింది. అలాగే, ఈడీ కేసులో కూడా ఆమెకు ఎలాంటి తీర్పు వస్తుందోనని ఆదోళన వ్యక్తమవుతుంది. కాగా, ఢిల్లీ మద్యం కేసులో కవితను ఈడీ మార్చి 15వ తేదీన అదుపులోకి తీసుకోగా, సీబీఐ ఏప్రిల్ 11వ తేదీన అరెస్టు చేసిన విషయం తెల్సిందే. దీంతో ఆమె రెండు బెయిల్‌ పిటిషన్లు వేశారు. ప్రస్తుతం ఆమె జ్యూడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో ఉన్నారు. 
 
ఎన్నికల్లో ఇచ్చే ఉచితాలపై కేంద్రం శ్వేతపత్రం విడుదల చేయాలి : ఆర్బీఐ మాజీ గవర్నర్ 
 
లోక్‌సభ లేదా అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచితాలపై కేంద్రం శ్వేతపత్రం విడుదల చేయాలని, అలాగే, ఈ ఉచితాలపై వివరణాత్మక చర్చ జరగాలని భారత రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఉచిత హామీల అమలుకు వెచ్చించే సొమ్మును మరింత ప్రయోజనకరంగా ఉపయోగించే అవకాశం ఉందన్నారు. ఈ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. ఇందుకోసం ఉచిత హామీలు, వాటి అమలు వల్ల ప్రభుత్వ ఖజానాపై పడిన భారం.. తదితర వివరాలతో ఓ శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్రాన్ని, ప్రధాని నరేంద్ర మోదీని డి సుబ్బారావు డిమాండ్ చేశారు.
 
ఎన్నికలవేళ ఎడాపెడా ఉచిత హామీలు గుప్పించకుండా రాజకీయ పార్టీలపై కొంత నియంత్రణ పెట్టేందుకు ఓ వ్యవస్థ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో సమాజంలో విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. భారత్ వంటి పేద దేశంలో సమాజంలోని అట్టడుగు వర్గాలకు ప్రభుత్వమే కొన్ని కనీస సౌకర్యాలను కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అధికారంలోకి రావడమే లక్ష్యంగా కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఓటర్లపై ఉచిత హామీలు గుమ్మరిస్తున్నాయని ఆయన ఆరోపించారు. 
 
ప్రభుత్వం ఏర్పాటు చేశాక తామిచ్చిన ఉచిత హామీల అమలుకు అప్పులు చేస్తున్నాయని విమర్శించారు. ఇందుకోసం ఫిస్కల్ రెస్పాన్సిబిలిటి అండ్ బడ్జెట్ మేనేజ్ మెంట్ (ఎస్ఆర్ఎంబీ) పరిమితులను దాటేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోనైనా, రాష్ట్రంలోనైనా ప్రభుత్వాలకు ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరి అని ఆర్బీఐ మాజీ గవర్నర్ గుర్తుచేశారు. ఆర్థిక వృద్ధి రేటును ఏటా 7.6 శాతం కొనసాగించగలిగితే 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని ఆయన చెప్పారు.