1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 16 ఏప్రియల్ 2024 (08:25 IST)

ఆంధ్రాలో రాళ్లతో కొట్టుకుంటున్నారు... టీ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి

jaggareddy
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాళ్లతో కొట్టుకుంటున్నారని, ఈ సంస్కృతి పోవాలంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని తెలంగాణ కాంగ్రెస్ నేత నేత జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. విజయవాడలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన గులకరాయి దాడి ఘటన.. మరో కోడికత్తి డ్రామా వంటిదని ఆయన పేర్కొన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, న్యాయంగా ఆలోచన చేస్తే ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. అపుడు ఈ రాళ్లతో కొట్టుకోవడాలు ఉండవన్నారు. ఏపీలో రాళ్లతో కొట్టుకుంటున్నారని, జగన్ రాయితో కొట్టుకున్నాడని ఒకరు.. చంద్రబాబే కొట్టాడని మరొకరు చెబుతున్నారన్నారు. ఏపీ ప్రజలు కూడా అర్థం చేసుకోవడం లేదన్నారు. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇలాంటి పరిస్థితి ఉండదన్నారు. 
 
ఏపీలో ఈ అంశాలను తాను టీవీలో చూశానని చెప్పారు. ఏపీ వారికి విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై తీవ్రమైన కోపం ఉన్నట్టుగా చెబుతున్నారని, కానీ, కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. రెండు రాష్ట్రాలుగా విడిపోయామని, ఎవరికి వారు స్వయం పాలన చేసుకుంటున్నామని తెలిపారు. ఇపుడు ఏపీ ప్రజలు కూడా ఆలోచించాలని ఆయన కోరారు. మీకు స్వయంపాలన రావడం వల్ల మీ ముఖ్యమంత్రి హైదరాబాద్ నగరంలో ఉండటం లేదని, ఏపీలోనే గల్లీల్లో తిరుగుతున్నారని చెప్పారు. ఇందుకు కారణం రాష్ట్ర విభజన, సోనియా గాంధీ అన్నారు. దీనిని ప్రజలు కాస్త ఆలోచించాలని కోరారు. అందుకే న్యయంగా ఆలోచిస్తే ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఆయన అభిప్రాయపడ్డారు.