ఆదివారం, 2 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 2 ఫిబ్రవరి 2025 (16:31 IST)

సీఎం పీఠం నుంచి రేవంత్ రెడ్డిని దించేందుకు కుట్ర సాగుతోందా?

Revanth Reddy
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. ఆయనకు తెలియకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యారనే వార్తలు ఇపుడు రాష్ట్రంలోనే కాకుండా కాంగ్రెస్ పార్టీలో సైతం కలకలం రేపుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కుర్చీలోనుంచి దించే ప్లాన్‌లో భాగంగానే వీరంతా సమావేశమయ్యారా అనేది ఇపుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 
 
ఈ 12 మంది ఎమ్మెల్యేలు నిర్వహించిన సమావేశానికి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి నాయకత్వం వహించారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పందించారు. 'ఎమ్మెల్యేలం సమావేశమైన మాట వాస్తవమే కానీ అందులో రహస్యం ఏమీ లేదు' అని వివరణ ఇచ్చారు. రహస్యంగా భేటీ కావాల్సిన అవసరమూ తమకు లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం ఓ మీడియా సంస్థతో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తన వ్యక్తిత్వాన్ని తప్పుగా చూపిస్తే ఊరుకోబోనని హెచ్చరించారు.
 
రెవెన్యూ మంత్రి వద్ద తాను ఏ ఫైలు కూడా పెట్టలేదని తేల్చిచెప్పారు. నేను పెట్టానని చెబుతున్న ఫైల్ ఏంటో ఆయనే (నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి) చెప్పాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గాల అభివృద్ధిపై ఎమ్మెల్యేలు కలిసి మాట్లాడుకుంటే తప్పేముందని అనిరుధ్ రెడ్డి ప్రశ్నించారు. అయితే, పార్టీ అధిష్ఠానానికి చెప్పాల్సింది చాలానే ఉందని వ్యాఖ్యానించారు. త్వరలో పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్ దీప్ దాస్ మున్షిని కలిసి అన్ని విషయాలు మాట్లాడతానని వివరించారు.