ఆదివారం, 6 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 4 ఫిబ్రవరి 2024 (09:20 IST)

ఫిబ్రవరి 4 మధ్యాహ్నం 3.30 గంటలకు తెలంగాణ కేబినెట్ మీటింగ్...

revanthreddy
తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ఫిబ్రవరి నాలుగో తేదీ మధ్యాహ్న 3.30 గంటలకు జరుగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మంత్రివర్గ సభ్యులంతా హాజరుకానున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఈ మంత్రిమండలి సమావేశం జరుగనుంది. సచివాలయంలోని ఆరో అంతస్తులో కేబినెట్ మీటింగ్ హాలులో ఈ భేటీ జరుగుతుంది. కేబినెట్ భేటీ సమయంలో అందరూ స్పెషల్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, ప్రభుత్వ కార్యదర్శులు అందుబాటులో ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఆదేశాలు జారీచేశారు. 
 
ఇదిలావుంటే, సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రముఖ ఆర్థికవేత్త, ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియా భేటీ అయ్యారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి కేంద్ర, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, గడిచిన పదేళ్లలో భారీగా పెరిగిన అప్పుు, వాటి ప్రభావం, కాంగ్రెస్ హయాంలో దేశంలో అనుసరించిన ఆర్థిక సంస్కరణలతో పాటు అనేక అంశాలపై వారి మధ్య చర్చకు వచ్చాయి. 
 
ఈ భేటీలో రాష్ట్రంలోని జైళ్లలో మగ్గుతున్న సత్ ప్రవర్తన గల ఖైదీల విడుదల అంశం కూడా చర్చకు రానుంది. ఇప్పటికే జైళ్ల శాఖ 240 మంది సత్ ప్రవర్తన గల ఖైదీల జాబితాను సిద్ధం చేసింది. వీరిని విడుదల చేయాలంటే ప్రభుత్వం కేబినెట్‌లో చర్చించి, జీవోను జారీ చేయాల్సి ఉంటుంది. కేబినెట్‌ భేటీలో నీటిపారుదల శాఖ శ్వేతపత్రంపై కూడా మంత్రులు చర్చించనున్నారు. జూరాల నుంచి పర్దిపూర్‌కు, పర్దిపూర్‌ నుంచి సంగంబండ దాకా నీటిని తరలిస్తుండగా 20 టీఎంసీల నీటిని కొడంగల్‌, నారాయణపేట నియోజకవర్గాల్లోని లక్ష ఎకరాలకు నీటిని అందించడానికి వీలుగా నారాయణపేట - కొడంగల్‌ ఎత్తిపోతల పథకంపై మంత్రివర్గంలో చర్చించి, ఆమోద ముద్ర వేసే అవకాశాలున్నాయని సమాచారం. 
 
ఇప్పటికే ఈ పథకాన్ని చేపట్టాలని పూర్వ మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌ రెడ్డితో సమావేశమై, నివేదించుకోగా... దీనికి ఆయన సానుకూలత వ్యక్తం చేశారు. గృహ విద్యుత్తు వినియోగదారులకు 200 యూనిట్ల దాకా ఉచిత విద్యుత్తును అమలు చేసే గృహలక్ష్మి పథకం విధివిధానాలపై చర్చ జరుగనుంది. ఈ పథకానికి ఏ మేరకు ఖర్చు కానుంది? అమలు చేయడానికి మార్గదర్శకాలు ఏ విధంగా ఉండాలి? వంటి అంశాలపై చర్చించనున్నారు.