శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 10 మే 2021 (12:56 IST)

కేసీఆర్ కీలక నిర్ణయాలు.. తెల్ల రేషన్ కార్డు హోల్డర్లకు ఐదు కేజీల బియ్యం

తెలంగాణలో కరోనా కేసులు పెరిగిపోతున్న వేళ.. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని తెల్లరేషన్ కార్డుదారులందరికీ, ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున రేషన్ బియ్యాన్ని రెండు నెలలపాటు ఉచితంగా అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. 
 
అదేవిధంగా ప్రైవేటు టీచ‌ర్ల‌కు అందించే సాయాన్ని మ‌రో 80 వేల మందికి అందించ‌నున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని దాదాపు లక్షా ఇరవై వేల మంది బోధ‌న‌, బోధ‌నేత‌ర సిబ్బందికి నెలకు రూ. 2 వేలు, 25 కిలోల బియ్యాన్ని ఇప్పటికే అందజేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో మిగిలిన మరో 80 వేల మంది ప్రైవేటు టీచర్లకు, సిబ్బందికి కూడా అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకు సంబంధించి వేగంగా చర్యలు తీసుకోవలని సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
 
ముఖ్యంగా వైద్య సిబ్బందిపై భారం తగ్గించే దిశగా పలు చర్యలు చేపట్టేందుకు సీఎం కేసీఆర్ పలు చర్యలు తీసుకున్నారు. వైద్య సిబ్బందికి గౌరవప్రదమైన వేతనం ఇవ్వాలని అధికారులకు సూచించారు. కరోనా వల్ల దుర్భర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రజా సేవ చేసేందుకు యువ వైద్యులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 
 
అలాగే రాష్ట్రంలో 50 వేల మంది ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన వారున్నారని.. ఆసక్తి ఉన్నవారంతా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాల్లో వీరికి ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు.