శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 14 అక్టోబరు 2022 (12:12 IST)

బస్సు చార్జీకి డబ్బులు జీపే చేసి - రప్పించి యువకుడి హత్య

murder
తెలంగాణా రాష్ట్రంలో దారుణం జరిగింది. ప్రేమ వ్యవహారంలో ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. ఆ యువకుడు హత్యా స్థలానికి వచ్చేందుకు మరీ 200 రూపాయలను జీపే చేసి రప్పించి దారుణంగా హత్య చేశారు. ఈ దారుణం హైదరాబాద్ నగర పరిధిలోని ముషీరాబాద్ పరిధిలో జరిగింది. 
 
పోలీసుల కథనం మేరకు.. నాగర్ కర్నూలు జిల్లా కోడేరుకు చెందిన బాలస్వామి ఉపాధి కోసం కుటుంబంతో కలిసి హైదరాబాద్ వచ్చి పటాన్‌చెరులో ఉంటున్నాడు. ఆయన కుమారుడు శివకుమార్ కూలి పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో ముషీరాబాద్ చెందిన యువతితో శివకు ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. 
 
ఆమెను కలిసేందుకు శివ తరచుగా ముషీరాబాద్‌కు వెళ్లి వచ్చేవాడు. వీరి ప్రేమ వ్యవహారం యువతి ఇంట్లో తెలిసింది. దీంతో వారు శివను హత మార్చాలని నిర్ణయించుకున్నారు. పథకం ప్రకారం ఈ నెల 7వ తేదీ యువతితో శివకు ఫోన్ చేయించారు. చూడాలని ఉందని ఒకసారి రావాలంటూ ప్రాధేయపడింది. ఆ యువతి కుటుంబ సభ్యులు కూడా శివతో మాట్లాడి.. చూడాలని ఉందని ఒకసారి వచ్చి వెళ్లాలని కోరారు. 
 
అయితే, తన వద్ద డబ్బులు లేవని అందువల్ల రాలేనని చెప్పాడు. చార్జీలకు తాము డబ్బులు ఇస్తామని చెప్పి రూ.200 జీపే చేశారు. ఈ డబ్బులతో సాయంత్రానికి ముషీరాబాద్‌కు చేరుకున్నాడు. ఆ తర్వాత నుంచి శివ ఇంటికి రాకపోవడంతో అతని తల్లిదండ్రులు ముషీరాబాద్ వెళ్లి యువతి తల్లిదండ్రులను నిలదీశారు. వారి నుంచి సరైన సమాధానం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. యువతి కుటుంబ సభ్యుల్లోని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా, శివ తమ ఇంటికి వచ్చిన రోజునే హత్య చేసి ముషీరాబాద్‌లోని నాలాలో శవాన్ని పడేసినట్టు చెప్పారు. తమవి వేర్వేరు కులాలు కావడంతో శివను హత్య చేసినట్టు అంగీకరించారు. దీంతో శివ మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు. అలాగే, నిందితులందరిని అరెస్టు చేసేందుకు చర్యలు చేపట్టారు.