ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శుక్రవారం, 1 జనవరి 2021 (19:21 IST)

వృద్ధాశ్రమంలో సీపీ సజ్జనార్ కుటుంబ నూతన సంవత్సర వేడుకలు

’నూతన సంవత్సరం 2021’’ సందర్భంగా కార్ఖానాలోని జనక్ పూరి కాలనీ ఏబీఎం ప్లాజా లోని ఆర్ కే ఎస్ మదర్ థెరిస్సా ఫౌండేషన్ వృద్ధాశ్రమానికి సైబరాబాద్ పోలీస్ కమిషనర్  వీసీ సజ్జనార్ ఆయన సతీమణి అనుప వీ సజ్జనార్, కుమార్తెలు అధితి, నియతి, సీపీ  తమ్ముడి పిల్లలు చిన్నారులు సమర్థ్, సమృధ్ తో కలిసి ఈ ఉదయం వృద్ధాశ్రమంలో సీనియర్ సిటిజన్స్ తో కలిసి కేక్ కట చేసి, వారికి అల్పాహారం తినిపించి వారిలో వెలుగు ని నింపారు.

ముందుగా అందరికీ నూతన సంవత్సర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి సంతోషాన్ని పంచారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ నూతన సంవత్సరం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఆర్ కే ఎస్ మదర్ థెరిస్సా ఫౌండేషన్ ని సందర్శించడం సంతోషంగా ఉందన్నారు. 
 
తల్లిదండ్రులు కంటికి కనిపించే ప్రత్యక్ష దైవాలన్నారు. పిల్లలు వారి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. మనం ఏ స్థాయిలో ఉన్నప్పటికీ వారి బాగోగులను చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలదేనన్నారు. తల్లిదండ్రులు సంతోషంగా ఉంటేనే వారి ఆశీస్సులతో జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోగలమన్నారు.

వృద్ధుల ఆశ్రయం కోసం, వారి వైద్య సాయనికై ఇంత మంచి మెడికల్ హోమ్ సెంటర్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది.. అదే సమయంలో వృద్ధాశ్రమాల అవసరం లేని సమాజాన్ని నిర్మించాలన్నారు. రానున్న రోజుల్లో వృద్ధాశ్రమాలు అవసరం లేని సమాజాన్ని, రాష్ట్రాన్ని, దేశ నిర్మాణానికి ప్రతీ ఒక్కరూ పాటుపడాలన్నారు. ప్రతీఒక్కరూ దేశ భద్రత, సురక్షిత కోసం, అభివృద్ధి కోసం పునరంకితం కావాలన్నారు.
 
అనంతరం డాక్టర్ రామకృష్ణ ను సమాజం కోసం ఆయన చేస్తున్న సేవకు గాను సీపీ  అభినందించారు. తన వంతుగా వారికున్న పరిమితుల్లో డాక్టర్ రామకృష్ణ సమాజానికి సేవ చేస్తున్నారని.. ప్రతీ ఒక్కరూ సమాజానికి తమవంతుగా సేవ చేయాలన్నారు. సైబరాబాద్ పోలీసులు తరుపున  ఆర్ కే ఎస్ మదర్ థెరిస్సా ఫౌండేషన్ కు ఏదైనా సాయం కావాలన్నా చేసేందుకు సిద్ధమన్నారు. 

ఈ సందర్భంగా ఆర్ కే ఎస్ మదర్ థెరిస్సా ఫౌండేషన్ ఫౌండర్ డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ పోలీస్ వృత్తిపరంగా నిత్యం బిజీ గా ఉన్నప్పటికీ సీనియర్ సిటిజన్ల కళ్లలో ఆనందాన్ని నింపేందుకు ఆర్ కే ఎస్ మదర్ థెరిస్సా ఫౌండేషన్ కు కుటుంబ సమేతంగా విచ్చేసిన సీపీ సజ్జనార్ కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు. వృద్ధాశ్రమంలో నూతన సంవత్సర వేడుకలను జరుపుకొని సీపీ గారు నూతన ఒరవడికి నాంది పలికారన్నారు.

సరైన సమయానికి సరైన  వైద్య సాయం అందక/ అందించలేక దురదృష్టవశాత్తూ తన తల్లి గారైన రాములమ్మ చనిపోయారన్నారు.. తనలా మరెవరికీ అలాంటి పరిస్థితి రావద్దని  సదుద్దేశంతో 12 సంవత్సరాల క్రితం ఆర్ కే ఎస్ మదర్ థెరిస్సా ఫౌండేషన్ ను నెలకొల్పామన్నారు.

నూతన సంవత్సర వేడుకలకు  విచ్చేసి.. వయో వృద్ధులలో నూతనోత్సాహాని నింపిన సీపీ సజ్జనార్  మరియు వారి కుటుంబ సభ్యులకు డాక్టర్ రామకృష్ణ  మరియు సీనియర్ సిటిజన్లు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్  వీసీ సజ్జనార్ ఆర్ కే ఎస్ మదర్ థెరిస్సా ఫౌండేషన్ డాక్టర్ రామకృష్ణ, ఆర్ కే ఎస్ మదర్ థెరిస్సా ఫౌండేషన్ మేనేజర్ నాగబూషణం, డాక్టర్ ఛత్రి, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ప్రమోద్, ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ ఆనంద్,  కృష్ణ చౌదరీ, జోష్ వెబ్ సైట్ వాలంటీర్లు మదన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.