శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 8 డిశెంబరు 2020 (10:29 IST)

ప్రొఫైల్ చూసి పెళ్లి ప్రతిపాదన... గిఫ్టు పేరుతో రూ.5.1 లక్షలకు టోకరా!!

సైబర్ ముఠాకు చెందిన ఓ యువతి హైదరాబాద్ నగరానికి చెందిన ఓ టెక్కీకి ఏకంగా రూ.5.1 లక్షలకు టోకరా వేసింది. మ్యాట్రిమోని ప్రొఫైల్ చూసిన ఆ యువతి.. తొలుత స్నేహం చేసినట్టుగా నటించింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని ప్రతిపాదించింది. పిమ్మట... విదేశాల నుంచి విలువైన బహుమతిని పంపిస్తున్నానని నమ్మించి, 5.1 లక్షల రూపాయలకు టోకరా వేసింది. చివరకు తాను మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ నగరానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అయిన ఓ యువకుడు పెళ్లి చేసుకుందామనుకుని సంగం మ్యాట్రిమోనిలో తన వివరాలను నమోదు చేసుకున్నారు. అతడి ప్రొఫైల్‌ చూసిన సైబర్ ముఠాకు చెందిన ఓ యువతి తాను విదేశాల్లో ఉంటానని.. మీ ప్రొఫైల్‌ నచ్చిందంటూ అతడికి సమాచారం ఇచ్చింది. 
 
దీంతో ఇద్దరు ఒకరి ఫోన్‌ నంబర్‌ ఒకరు మార్చుకొని... కొన్ని రోజులు చాటింగ్‌ చేస్తూ ఒకరి గురించి మరొకరు తెలుసుకున్నారు. ఇంతలోనే మీకు విలువైన బహుమతి పంపిస్తున్నానంటూ సదరు యువతి యువకుడికి చెప్పింది. అతడిని నమ్మించడానికి గిఫ్ట్‌ పార్శిల్‌ ఫొటోను వాట్సాప్‌లో పంపించింది. అందులో డాలర్లు, విలువైన బంగారు ఆభరణాలున్నాయంటూ చెప్పింది. 
 
సంతోషంతో ఉన్న ఆ యువకుడికి.. మరుసటి రోజు ఢిల్లీ ఎయిర్‌ పోర్టు నుంచి కస్టమ్స్‌ అధికారులమంటూ ఫోన్‌ చేశారు. మీ పేరుపై విలువైన గిఫ్ట్‌ ప్యాక్‌ వచ్చిందని, స్కాన్‌ చేస్తే అందులో డాలర్లు, ఆభరణాలున్నాయని, దానికి కస్టమ్స్‌ ఫీజు చెల్లించలేదని, ఆ ఫీజు చెల్లించి పార్శిల్‌ తీసుకోవాలని మాట్లాడారు. 
 
కస్టమ్స్‌ ఫీజు చెల్లించాలంటే ఫలాన అకౌంట్‌లో డిపాజిట్‌ చేయాలంటూ ఒక బ్యాంకు ఖాతాను ఇచ్చారు. అలాగే జీఎస్‌టీ, ఆదాయపన్ను, యాంటీ టెర్రరిస్ట్‌ సర్టిఫికెట్‌ ఫీజంటూ దఫ దఫాలుగా అతడి నుంచి రూ. 5.1 లక్షలు మూడు బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్‌ చేయించారు. ఇంకా డబ్బు అడుగుతుండటంతో బాధితుడికి అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు సైబర్‌ క్రైం ఇన్‌స్పెక్టర్‌ వెంకట్రామిరెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.