గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 జూన్ 2021 (13:22 IST)

రోగులను ప్రైవేటు ఆస్పత్రులు జలగల్లా పీల్చిపిప్పి చేస్తుంటే.. జీవోలు ఇవ్వరా?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా బాధితులకు చికిత్స పేరుతో అధిక ఫీజులతో ప్రైవేటు ఆస్పత్రులు కరోనా రోగుల్ని పీల్చిపిప్పి చేస్తుంటే కట్టడి చేసేందుకు చార్జీలను నిర్ణయిస్తూ జీవో ఇవ్వడానికి రాష్ట్ర సర్కార్​కు ఉన్న కష్టమేంటని హైకోర్టు నిలదీసింది. 
 
కరోనా చికిత్స బిల్లులకు గరిష్ట ధరలు నిర్ణయించాలని చెప్తే ఎందుకు చేయడం లేదని ప్రశ్నించింది. అట్లనే కరోనా చికిత్సలో వాడే లైఫ్‌‌‌‌ సేవింగ్‌‌‌‌ డ్రగ్స్‌‌‌‌ను అత్యవసర మందుల జాబితాలో ఎందుకు చేర్చడం లేదని కేంద్ర ప్రభుత్వాన్న కూడా ప్రశ్నించింది. 
 
ప్రజల ఆరోగ్యమంటే ఏమనుకుంటున్నారని, వారి జీవితాతో చెలగాటం ఆడితే ఎట్లని నిప్పులు చెరిగింది. కరోనాపై దాఖలైన పిల్స్‌‌‌‌ను బుధవారం చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ హిమా కోహ్లీ, జస్టిస్‌‌‌‌ విజయ్‌‌‌‌సేన్‌‌‌‌రెడ్డి డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ విచారించింది. నాలుగు వారాల సమయం ఇస్తే జీవో ఇస్తామని సర్కార్ చెప్పడాన్ని తప్పుపట్టింది. 
 
కార్పొరేట్‌‌‌‌ ఆస్పత్రులు కరోనా బాధితులను ఫీజుల పేరుతో పిండేస్తుంటే ప్రభుత్వానికి కనబడటం లేదా? పిప్పి చేస్తుంటే కూడా తెలియడం లేదా? ఆలస్యం చేయడం అంటే దోపిడీకి ద్వారాలు తెరిచినట్లే కదా? రెండు వారాల్లోగా గరిష్ట చార్జిల జీవో జారీ చేసి ఈ నెల 23న జరిగే విచారణలో సమర్పించాలని ఆదేశించింది. 
 
అలాగే, కరోనా చికిత్సలో వాడే లైఫ్‌‌‌‌ సేవింగ్‌‌‌‌ డ్రగ్స్‌‌‌‌ను అత్యవసర మందుల జాబితాలో చేర్చుతున్నదీ లేనిదీ చెప్పకుండా కేంద్రం అరకొర వివరాలతో నివేదిక ఇస్తే కుదరదని, వచ్చే విచారణ సమయంలో సూటిగా విషయాన్ని చెబుతూ అఫిడవిట్‌‌‌‌ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.